నర్సంపేట రూరల్/ ఖానాపురం, జూన్ 25 : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన అభ్యర్థులను విడుదల చేసి, వారిపై కేసులు ఎత్తివేయాలని, భవిష్యత్తులో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్లో వీరికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ త్రివిధ దళాల అధిపతి, భారత రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి వినోద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్మీ పరీక్షల అభ్యర్థులు అగ్నిపత్ పథకంతో ఆందోళనకులోనై ఉద్వేగ పూరిత వాతావరణంలో నిరసనకు దిగారని, ఇది ఎంత మాత్రం కుట్ర కాదని స్పష్టం చేశారు. అరెస్టయిన అభ్యర్థులపై కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు.
ప్రధాని మోదీ దివాలాకోరు, అనాలోచిత చర్యలు దేశానికి ప్రమాదంగా మారాయని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ నిజంగా దేశభక్తుడైతే ఆర్మీలో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చేవారే కాదని పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాల వంటి అనాలోచిత చర్యలకు తోడుగా ప్రస్తుతం అగ్నిపథ్ పథకం కొత్తగా వచ్చి చేరిందన్నారు. 2018, 2019 సంవత్సరాల్లో చాలామంది ఆర్మీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారంతా 2020లో ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయ్యారని వివరించారు. దామెర రాకేశ్ కూడా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడని చెప్పారు.
రిటర్న్ టెస్ట్కు ఎదురుచూస్తున్న సమయంలో అగ్నిపథ్ అనే కొత్త పథకాన్ని తెచ్చి కేంద్రం యువకుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ రాకేశ్ సోదరుడు రామ్రాజ్కు వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ సీఎం కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శనివారం జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. రాకేశ్ కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్గ్రేషియాను అందిస్తామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మురాల మోహన్రెడ్డి, ఆకుల రమేశ్, మురారి రవి, నాయకులు బానోత్ సంగులాల్, నల్లా మనోహర్రెడ్డి, గుంటి కిషన్, దార్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
దబీర్పేటలో దామెర రాకేశ్ కుటుంబసభ్యులను బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శనివారం పరామర్శించారు. రాకేశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చారు. కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాకేశ్ అన్న రామ్రాజ్కు ప్రభుత్వం ఉద్యోగం కల్పించిందని గుర్తుచేశారు. వారివెంట ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కాస ప్రవీణ్కుమార్, మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, నాయకులు లెక్కల విద్యాసాగర్రెడ్డి, సంగులాల్, రామసహాయం ఉపేందర్రెడ్డి, గుంటి కిషన్, లింగమూర్తి, వెంకటనారాయణ, దేవేందర్రావు, గొర్రె రవి, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, నాగరాజు, దిలీప్, శ్రావణ్కుమార్, రమేశ్ పాల్గొన్నారు.