వర్ధన్నపేట, జూన్ 25 : ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ గోపి అన్నారు. శనివారం పట్టణంలోని ఫిరంగిగడ్డలో ఉన్న ప్రభుత్వ బీసీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్ధన్నపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రైవేట్ భవనంలో నడుస్తున్నందున దీన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలోనే హాస్టల్ భవనానికి మరమ్మతులు చేయిస్తామన్నారు. ఎస్టిమేట్లు తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆయుర్వేద వైద్యశాల సందర్శన..
వరంగల్ చౌరస్తా : వరంగల్ లక్ష్మీపురంలోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల, లేబర్కాలనీలోని ఆయుర్వేద వైద్య కళాశాలను కలెక్టర్ గోపి సందర్శించారు. వైద్యశాలలో సేవలు పొందుతున్న, అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య, రోగులకు అందుతున్న వైద్యసేవలు, మందుల వివరాలు, వైద్య విద్య అభ్యసిస్తున్న వారి సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో పూర్తి సంప్రదాయ పద్ధతిలో సేవలు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.