సుబేదారి, జూన్ 25 : వరంగల్ పాతబీట్బజార్కు చెందిన బెల్లం వ్యాపారి చిటికేశి సదాశివుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్రావు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడుంబా తయారీదారులకు చిటికేశి సదాశివుడు అక్రమంగా బెల్లం, గుడుంబా తయారీకి కావాల్సిన ముడి సరుకులు సరఫరా చేస్తున్నాడు. పక్కా సమాచారంతో గతంలో అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు తెలిపారు. అయినా కూడా సదాశివుడిలో మార్పు రాలేదని అంజన్రావు తెలిపారు. అక్రమం బెల్లం, ముడిసరుకుల రవాణా దందా అరికట్టడానికి హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశాల మేరకు సదాశివుడిని అరెస్టు చేసి శనివారం చర్లపల్లి జైలుకు తరలించామని ఆయన పేర్కొన్నారు.
హనుమకొండ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ, ఎస్సై బాలకిషన్ జైలులో నిందితుడికి పీడీ యాక్ట్ ఉత్తర్వులను జైలులో అందించినట్లు పేర్కొన్నారు. పరకాలకు చెందిన సదాశివుడు బెల్లం దందాను మొదట పరకాల ప్రాంతంలో ప్రారంభించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు విస్తరించి మాఫియాగా ఎదిగాడు. గతంలో కూడా పీడీ యాక్ట్తో 6 నెలలు జైలుకు వెళ్లివచ్చాడు, అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. జైలుకు వెళ్లడం, బెయిల్పై విడుదల కావడం, మళ్లీ దందా కొనసాగించడం షరామాములే. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అతడిపై 20కిపైగా కేసులు ఉన్నటు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు.