వరంగల్, మే 22(నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా హ్యాబిటేషన్కో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. జిల్లాలోని 576 హ్యాబిటేషన్లలో పల్లె ప్రకృతి వనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పల్లెలకు కొత్త అందాన్ని తెచ్చాయి. పల్లె ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాక్లను నిర్మించారు. కొన్ని పల్లె ప్రకృతి వనాల్లో ఓపెన్ జిమ్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి తోడు ఏడాది క్రితం మండలానికో బృహత్ పల్లె ప్రకృతి వనాలను నెలకొల్పింది. మండలంలో పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న గ్రామంలో వీటిని ఏర్పాటు చేసింది. ఒక్కో బీపీపీవీలో అధికారులు 31 వేల మొక్కలు నాటారు. వీటిలో నీడనిచ్చే మొక్కలతో పాటు స్థానిక గ్రామ పంచాయతీకి ఆదాయాన్నిచ్చే వివిధ రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఆపిల్ బేర్, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, జామ, రేగు, నేరేడు, సీతాఫలం వంటి మొక్కలను కూడా నాటారు. ఈ బీపీపీవీల్లో మొక్కలకు డ్రిప్ పద్ధతిలో నీరందే ఏర్పాట్లు చేశారు. ప్రతి బీపీపీవీలో దారులు నిర్మించి క్రీడల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించారు.
జిల్లాలో ఎక్కడంటే..
జిల్లాలో 13 మండలాలు ఉండగా వరంగల్, ఖిలావరంగల్ మినహా పదకొండు మండలాల్లో అధికారులు బీపీపీవీల ఏర్పాటు పనులు ప్రారంభించారు. మండలానికి ఒకటి చొప్పున పదకొండు బీపీపీవీల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఒక్కోటి పదేసి ఎకరాల్లో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. పది మండలాల్లో పది బీపీపీవీలను ఏర్పాటు చేశారు. ఒక మండలంలో ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. చెన్నారావుపేట మండలంలో కోనాపూర్, గీసుగొండ మండలంలో వంచనగిరి, ఖానాపురం మండలంలో కీర్యతండా, నల్లబెల్లి మండలంలో కొండాపూర్, నర్సంపేట మండలంలో రాజుపల్లి, నెక్కొండ మండలంలో బొల్లికొండ, పర్వతగిరి మండలంలో కొంకపాక, రాయపర్తి మండలంలో రాయపర్తి, సంగెం మండలంలో తిమ్మాపూర్, వర్ధన్నపేట మండలంలో ఉప్పరపల్లి గ్రామం వద్ద ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. వంచనగిరి, కీర్యతండా, బొల్లికొండ, కొంకపాక, తిమ్మాపూర్, ఉప్పరపల్లి బీపీపీవీలను పదేసి ఎకరాలు, రాజుపల్లి, రాయపర్తి బీపీపీవీలను 8.5 ఎకరాలు, కోనాపూర్, కొండాపూర్ బీపీపీవీలను ఎనిమిదేసి ఎకరాల్లో నెలకొల్పారు. ఈ బీపీపీవీల్లో 1,14,898 మొక్కలను నాటినట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించారు.
అత్యధికంగా తిమ్మాపూర్ బీపీపీవీలో 25,530, ఉప్పరపల్లిలో 23 వేలు, రాయపర్తిలో 18,391, వంచనగిరిలో 14,559, కొండాపూర్ బీపీపీవీలో 13,800 మొక్కలను నాటినట్లు తెలిపారు. నేరేడు, చింత, సీతాఫలం, మారేడు, తంగేడు, వేప, జామ, రేగు, దానిమ్మ, రావి, అరికఫామ్, గుల్మెహర్, రామసీతాఫలం, మామిడి, బహునియా, టేకు, వెదురు, పైడి తంగేడు, కానుగ, టేకోమా, మోదుగ, గచ్చకాయ, నిమ్మ, పనస, సిసిన్ఫిలియా తదితర రకాల మొక్కలు నాటారు. కొండాపూర్ బీపీపీవీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇటీవల కలెక్టర్ బీ గోపి ప్రారంభించారు. దుగ్గొండి మండలంలో కేశవాపూర్ గ్రామంలో మాత్రం ఐదు ఎకరాల్లో చేపట్టిన బీపీపీవీ ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మండలానికి మరో నాలుగు..
ఇప్పటివరకు తొలివిడుత మండలానికో బీపీపీవీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా ప్రతి మండలంలో మరో నాలుగింటిని నెలకొల్పాలని నిర్ణయించింది. వీటిని ఐదేసి ఎకరాల్లో ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఒకేచోట పది ఎకరాల ప్రభుత్వ స్థలం లభించకపోతుండడం వల్ల ఐదేసి ఎకరాల్లో నెలకొల్పే పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. దీంతో అధికారులు కొద్ది రోజుల నుంచి ఆయా మండలంలో నాలుగు గ్రామాల్లో బీపీపీవీల ఏర్పాటు కోసం ఒకేచోట ఐదేసి ఎకరాల ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో తలమునకలయ్యారు. జూన్ 3 నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్నందున అప్పటిలోగా ప్రతి మండలంలో ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే నాలుగేసి బీపీపీవీల్లో నిర్దేశిత మొక్కలు నాటేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో నాటే మొక్కలతో పాటు ఈ బీపీపీవీల్లోనూ మొక్కలు నాటేందుకూ సమాయత్తం అవుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే బీపీపీవీలతో జిల్లాలో వీటి సంఖ్య 55కు చేరనుంది.