ఖిలావరంగల్, మే 22 : ఖమ్మం ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు డ్రైవర్ దుర్మరణం చెందాడు. స్థానికులు, మామునూరు పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ పెగడపల్లి డబ్బాల ప్రాంతానికి చెందిన పల్లపు పద్మ (35), వల్లపు మీన (28) మట్టి పనిచేసుకొని కుటుంబానికి అండగా ఉంటున్నారు. శనివారం ఖమ్మం రోడ్డులోని ఓ ప్రాంతంలో మట్టి పని చేసి తిరిగి వచ్చేటప్పుడు ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్కు చెందిన ఎండీ యాకూబ్పాషా అలియాస్ బబ్లూ ఆటో ఎక్కారు. ఆటో బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి రాగానే ఎదురుగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రెండు భాగాలుగా విడిపోయి రోడ్డు పక్కన పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న పద్మ, మీనాతో పాటు ఆటో డ్రైవర్ యాకూబ్ పాషా అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ మాత్రం ఆపకుండా ఆటో పైకప్పును కిలోమీటర్ మేర ఈడ్చుకు వెళ్లి రోడ్డు పక్కన పడేసి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం వెతుకున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు.
బైక్ అదుపుతప్పి ఎంబీబీఎస్ వైద్యుడు..
చెన్నారావుపేట : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని రామన్నకుంట తండా వద్ద జరిగింది. ఎస్సై తోట మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేటకు చెందిన కుదురుపాక రాజు(28) ములుగు ఏరియా దవాఖానలో వైద్యుడి(ఎంబీబీఎస్)గా పనిచేస్తున్నాడు. ఆదివారం నెక్కొండకు వెళ్లి వస్తుండగా రామన్నకుంట తండా వద్ద రాజు ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఎద్దును ఢీకొట్టి కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఎద్దు కుడా చనిపోయినట్లు ఎస్సై తెలిపారు.
రైలు ఢీకొని మహిళ..
ఖిలావరంగల్ : రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ దుర్మరణం చెందిన ఘటన ఆదివారం అబ్బనికుంట మైసమ్మ దేవాలయం సమీపంలోని జరిగింది. వరంగల్ జీఆర్పీ ఎస్సై సీహెచ్ పరశురాములు కథనం ప్రకారం.. సుమారు 50 ఏళ్ల వయసున్న మహిళ అబ్బనికుంట మైసమ్మ దేవాలయం సమీపంలో ఆగి ఉన్న గూడ్సు రైలు కింది నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో రైలు ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించాం. ఆచూకీ తెలిసిన వారు ఎంజీఎం దవాఖాన మార్చురీ లేదా వరంగల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై కోరారు.