నల్లబెల్లి, మే 22: బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. బాలురతో సమానంగా అన్ని రంగాల్లో రాణించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందు కోసం మెరుగైన విద్య అందించేందుకు సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా నల్లబెల్లి మండలకేంద్రంలో నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ భవన సముదాయం అన్ని హంగులతో సర్వాంగసుందరంగా ప్రారంభానికి ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం-విద్యాశాఖ ఆధ్వర్యంలో కేజీబీవీలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల అభివృద్ధి కోసం సమగ్ర శిక్ష ఏడబ్ల్యూపీ, బీ నిధులు రూ. 2.50 కోట్లు మంజూరయ్యాయి. వాటితో 2019 డిసెంబర్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. రెండుసార్లు కరోనా కారణంగా పనుల్లో జాప్యం జరిగినా ఎట్టకేలకు భవన సముదాయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
260 మందికి విద్యా బోధన
ప్రస్తుతం నల్లబెల్లి కేజీబీవీలో పాఠశాల విద్యార్థినులు 120, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 140 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇంటర్ బోధనకు పిల్లల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా అదనపు తరగతి గదులతోపాటు కంప్యూటర్ గదులు, ల్యాబ్ కోసం ప్రత్యేక గదులు, ప్రిన్సిపాల్ గది, అధ్యాపకుల కోసం ఆఫీస్ రూంలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, మీటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి నూతన భవనాన్ని ప్రారంభిస్తే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.
భవనాన్ని అందుబాటులోకి తేవాలి
రూ. 2.50 కోట్ల వ్యయంతో కేజీబీవీ అదనపు తరగతి గదులను నిర్మించడం ఆనందంగా ఉంది. ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ అవడం వల్ల ప్రస్తుత భవన సముదాయంలో విద్యార్థినులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి నూతన భవనాన్ని అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకోవాలి.
– సునీత, కేజీబీవీ ప్రత్యేక అధికారి, నల్లబెల్లి
భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు
కరోనా వల్ల రెండుసార్లు కేజీబీవీ భవన నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 2.50 కోట్ల నిధులతో అన్ని హంగులతో భవన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాం. త్వరలోనే జిల్లా ఉన్నతిధికారులు, ప్రజాప్రతినిధుల కృషితో భవనాన్ని ప్రారంభించి విద్యార్థినులకు అందుబాటులోకి తెస్తాం.
– అశోక్కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్(టీఎస్ఈడబ్ల్యూఐడీసీ)