నర్సంపేట రూరల్, మే 22: జిల్లావ్యాప్తంగా సోమవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 56 పరీక్షా కేంద్రాల్లో 9,940 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రోజూ పరీక్ష కేంద్రంలో డ్రా పద్ధతిలో ఇన్విజిలేటర్లను నియమిస్తారు. సబ్జెక్టుకు సంబంధించిన ఇన్విజిలేటర్లు ఆ రోజు విధుల్లో ఉండరు. కోడ్ పద్ధతిలోనే బోర్డు నుంచి ఆన్లైన్ ద్వారా ఇన్విజిలేటర్లను నియమించారు. వారు గుర్తింపు కార్డులు కలిగి ఉంటారు. ఎక్కువ మంది విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడితే విధినిర్వహణలో ఉన్న ఇన్విజిలేటర్ను విధుల నుంచి తొలగించడంతోపాటు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.
మండలాల్లో సర్వం సిద్ధం
సంగెం/ఖానాపురం/పర్వతగిరి/గీసుగొండ: సంగెం మండలంలోని జడ్పీహెచ్ఎస్, గవిచర్ల మోడల్ స్కూల్ లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో ఎన్ విజయ్కుమార్ తెలిపారు. మండలంలోని 11 ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 386 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 197 మంది బాలికలు, 189 మంది బాలురు ఉన్నారని చెప్పారు. సంగెంలో166 మంది, గవిచర్ల మోడల్స్కూల్లో 197 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్సై కిరణ్మయి తెలిపారు. ఖానాపురం మండలంలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంఈవో రత్నమాల తెలిపారు.
ఖానాపురం సెంటర్లో 109, బుధరావుపేట మోడల్ స్కూల్ సెంటర్లో 160 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పర్వతగిరి మండలంలోని మూడు సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో చదువుల సత్యనారాయణ తెలిపారు. 11 ఉన్నత పాఠశాలలు, ఐదు ప్రైవేటు స్కూళ్ల పరిధిలో మొత్తం 585 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. పర్వతగిరిలోని మోడల్ స్కూల్లో 198 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 200 మంది, సాంఘిక సంక్షేమ పాఠశాలలో 185 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. గీసుగొండ మండలం ధర్మారం జడ్పీహెచ్ఎస్లో 260, గీసుగొండ జడ్పీహెచ్ఎస్లో 250, మరియపురం సెయింట్ జాన్ హైస్కూల్లో 180 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఎంఈవో సత్యనారాయణ తెలిపారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
పదో తరగతి వార్షిక పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ఈసారి జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తాం. జిల్లావ్యాప్తంగా 56 పరీక్ష కేంద్రాల్లో 434 హైస్కూళ్ల నుంచి 9,940 మంది రెగ్యులర్, మరో 13 మంది ప్రైవేటు విద్యార్థులు టెన్త్ వార్షిక పరీక్షలు రాయనున్నారు.
– డీ వాసంతి, డీఈవో