నర్సంపేట రూరల్, మే 22: విలేజ్ పార్కులు ప్రకృతి అందాలకు నిలయంగా మారుతున్నాయి. పట్టణాలు, ప్రధాన నగరాలకే పరిమితమైన పార్కులు నేడు పల్లెల్లోనూ ఏర్పాటవుతున్నాయి. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలు, తండాల్లో పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ భూములను పరిరక్షించడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు చక్కటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు(విలేజ్ పార్కులు) పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలతో కళకళలాడుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యంతో విలేజ్ పార్కులు అందంగా రూపుదిద్దుకున్నాయి. పట్టణాలు, గ్రామాలు, మారుమూల పల్లెలు, శివారు తండాల ప్రజలకు పల్లెప్రకృతి వనాలు ప్రశాంతమైన వాతావరణాన్ని పంచుతున్నాయి. విలేజ్ పార్కుల నిర్మాణంతో అన్ని గ్రామాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామగ్రామానా చేపట్టిన విలేజ్ పార్కులు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. దీంతో పార్కు అంటే తెలియని మారుమూల తండాల ప్రజలకు ప్రస్తుతం ఇంటి ముంగిట్లోనే పార్కు ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో గ్రామంలో రెండు మూడు పార్కులు..
ఒక్కో గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు మూడు పార్కులు ఏర్పాటు చేశారు. గ్రామంతోపాటు ఆవాస ప్రాంతాల్లోనూ పార్కులు నిర్మించారు. నర్సంపేట మండలంలో 27 గ్రామాల్లో ఆవాస ప్రాంతాలను కలుపుకొని మొత్తం 47 విలేజ్ పార్కులు రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారుల సమన్వయంతో తొలుత పార్కు ఏర్పాటు స్థలాలను గుర్తించారు. స్థలాన్ని చదును చేయడం, మొరం పోయడం లాంటి పనులకు ఉపాధిహామీ పథకంలో రూ. 30 వేలు కేటాయించారు. ఒక్కో పార్కులో రూ. 30 వేలు వెచ్చించి 40 ట్రిప్పుల మొరం పోయాల్సి వచ్చింది. ఎక్కువ, తక్కువకు గ్రామ పంచాయితీ ప్రత్యేక నిధులను ఉపయోగించారు. అదేవిధంగా పార్కుల చుట్టూ పెన్సింగ్, పోల్స్, తీగలు, ప్రవేశద్వారం ఏర్పాటుకు గ్రామపంచాయితీల ప్రత్యేక నిధులను ఉపయోగించారు. నర్సంపేట మండలంలో వంద శాతం పార్కుల నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామాల్లో ప్రారంభోత్సవాలు సైతం చేసుకుంటున్నారు. ప్రతి పార్కులో సుమారు 2 వేల మొక్కలు నాటారు.
కళకళలాడుతున్న పార్కులు..
గ్రామాల్లో విలేజ్ పార్కులు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే 95 శాతం పార్కులు ప్రారంభోత్సవాలు చేసుకోగా, మరో ఐదు శాతం పార్కులు చివరి దశకు చేరుకున్నాయి. మండలస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యంతో పార్కు నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగాయి. విలేజ్ పార్కులో మొక్కల పెంపకాన్ని గ్రామస్తులు బాధ్యతగా తీసుకున్నారు. గతంలో నిర్విరామంగా కొనసాగిన విలేజ్ పార్కు పనులను మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి సూచనలు చేశారు. ఏది ఏమైనప్పటికీ పల్లెప్రకృతి వనాల ఏర్పాటును అన్ని గ్రామాల్లోని ప్రజలు స్వాగతిస్తున్నారు.
చివరి దశకు చేరుకున్న పార్కులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన పల్లెప్రకృతి వనాలు మండలంలో పూర్తి దశకు చేరుకున్నాయి. మండలవ్యాప్తంగా ఒకట్రొండు పార్కులు మినహా అన్ని చివరిదశకు చేరుకొని ప్రారంభోత్సవాలను సైతం పూర్తి చేసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పూర్తి సహకారంతో పార్కుల నిర్మాణం చేపట్టాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థలాలను గుర్తించి నిర్మాణాలు చేశాం. గ్రామాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఈ పార్కులు ఎంతగానో ఉపయోగపడుతాయి.
– అంబటి సునీల్కుమార్రాజ్, నర్సంపేట ఎంపీడీవో
ఆహ్లాదాన్ని పంచుతున్న వనాలు
గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విలేజ్ పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో ఇటు ప్రజలకు ప్రశాంత వాతావరణం లభించడంతోపాటు అటు ప్రభుత్వ భూమిని పరిరక్షించుకోవచ్చు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పార్కులను ప్రతి ఒక్కరూ సందర్శించి ప్రశాంత జీవనాన్ని గడుపాలి.
– సంపత్రావు, డీఆర్డీవో పీడీ వరంగల్