గిర్మాజీపేట, మే 22: దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త మాదరి భాగ్యరెడ్డివర్మ 134వ జయంతిని ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు భూక్యా హరిసింగ్, శ్రీవత్స కోట(రెవెన్యూ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీల్లో విద్యావశ్యకతను మొట్టమొదటిగా గుర్తించిన దళిత సమాజనోద్దరుడు భాగ్యరెడ్డివర్మ అని కొనియాడారు. ఆయన సమాజానికి చేసిన సేవలకు గాను 1913లో ఆర్యసమాజ్ వారు ఆయనకు ‘వర్మ’ అనే బిరుదును ప్రదానం చేశారని, అప్పటి నుంచి ఆయన భాగ్యరెడ్డివర్మగా ప్రసిద్ధిగాంచారని గుర్తుచేశారు. ఆయన చూపిన బాటలో దళితులందరూ పయనించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఏ రాజారావు, సీపీవో జీవరత్నం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, దళిత నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
గీసుగొండ: మండలకేంద్రంలో ఆదివారం దళిత వైతాలికుడు భాగ్యరెడ్డివర్మ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దౌడు బాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాగ్యరెడ్డివర్మ దళితుల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో స్థానికులు చాపర్తి కుమార్, నర్సింహస్వామి, యాదగిరి, యుగేంధర్, శరత్, సంపత్ పాల్గొన్నారు.