ఖిలావరంగల్, మే 21: దళితవాడల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్లోని పడమరకోట వీరుగడ్డ జంక్షన్లో కార్పొరేటర్ బోగి సువర్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ జెండాను శనివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గతేడాది రూ. 70 లక్షల నిధులతో దళితకాలనీలో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. దళితబంధు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో వంద మంది అర్హులను గుర్తించి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల విలువైన యూనిట్లను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో మరికొంత మందిని ఎంపిక చేసి దళితబంధు పథకం ద్వారా యూనిట్లు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, 34వ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, నాయకులు నలిగంటి అభిషేక్, సంగరబోయిన ఉమేశ్, విజయ్, బిల్ల మరేందర్, సుధాకర్ పాల్గొన్నారు.
నన్నపునేనిని కలిసిన ట్రాఫిక్ సీఐ
గిర్మాజీపేట: ఇటీవల ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన జీ బాబూలాల్ శనివారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ను శివనగర్లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ట్రాఫిక్ సీఐకి శుభాకాంక్షలు తెలిపారు. నగరాన్ని ట్రాఫిక్ రహితంగా మార్చేందుకు పోలీస్ సిబ్బంది కృషి చేయాలని నన్నపునేని కోరారు. ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.