హనుమకొండ, మే 21 : పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. కార్మిక చైతన్య మాసోత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో చైతన్య మాసోత్సవ కన్వీనర్, ప్రొఫెసర్ పుల్లా శ్రీనివాస్ అధ్యక్షతన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ-సామాజిక న్యాయం అనే అంశంపై జరిగిన సెమినార్కు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ముఖ్య అతిథిగా, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
కార్మికుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వారిని చైతన్యం చేసి సమస్యల పరిష్కారం కోసమే మే నెల చైతన్య మాసోత్సవం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్న 29 చట్టాలను రద్దు చేసి కోడ్ వ్యవస్థను తీసుకొచ్చిన కేంద్రం సంఘటిత, అసంఘటిత కార్మికుల పొట్టకొడుతోందని మండిపడ్డారు. కార్మికుల హకులు, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వారి కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు చేసిన పోరాటంతో కేంద్రం ప్రభుత్వం దిగి వచ్చి నల్లచట్టాలను ఉపసంహరించుకుందని, అదే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకూ ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, మేధావులు సంఘటితమై పారాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ పోరాటం ఓరుగల్లు నుంచే పురుడు పోసుకోవాలని వినయ్భాస్కర్ కోరారు. లాభాల్లో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడాన్ని తిప్పికొట్టాలన్నారు. డిజిటలైజేషన్, గ్లోబలైజేషన్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానంతో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో సామాన్యులకు సైతం ప్రమాదం పొంచి ఉందన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగులు, మేధావులు కేంద్రం వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలన్నారు.
దేశాన్ని అమ్ముతున్నారు..
కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అన్నారు. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఒక వైపు సిమెంట్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను అమ్మిందన్నారు. మేక్ ఇండియా అంటున్న కేంద్ర ప్రభుత్వం స్క్రాప్ ఇండియాగా మారుస్తుందన్నారు. ఎల్ఐసీని కేంద్రం అమ్మకానికి పెట్టడం చట్టవిరుద్ధం అన్నారు. ఎల్ఐసీకీ కేంద్రం అసలు యజమానే కాదన్నారు. 40 కోట్ల పాలసీదారులు ఉన్న ఎల్ఐసీలో కేంద్రం పెట్టిన పెట్టుబడి రూ.5 కోట్లు మాత్రమేని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎల్ఐసీ ఆస్తులతో సమానంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఎల్ఐసీ లాంటి కంపెనీ లేదని ఆయన పేర్కొన్నారు. ఎల్ఐసీ షేర్ల అమ్మకంలో రూ.54 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలిపారు. రూ.4.5 లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీలు కంపెనీని రూ.35 వేల కోట్లకు అమ్మారని అన్నారు. ఒక్క కంపెనీని కూడా విజయవంతంగా నడుపని అనిల్అంబానీకి ఎయిర్ ఇండియా లాంటి సంస్థలను అప్పగిస్తున్నారన్నారు.
ప్రభుత్వరంగ సంస్థలు వ్యాపారం చేయద్దనే ఉద్దేశంతోనే కేంద్రం అన్నింటినీ ప్రైవేట్పరం చేస్తుందన్నారు. ఓవైపు బీఎస్ఎన్ఎల్ను అమ్ముతూనే మరోవైపు వొడా ఫోన్ లాంటి కంపెనీలలో వాటాలను కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. విశాఖ స్టీలు ఫ్యాక్టరీకి గనులు లేవని, టాటా బిర్లా లాంటి కార్పొరేట్ సంస్థలు గనులు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం మాత్రం అనుమతిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలను అమ్ముకునేందుకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోందన్నారు. భావోద్వేగం వెంట పరుగెడితే దేశ ఆర్థిక రంగం దెబ్బతిని శ్రీలంక పరిస్థితి మన దేశానికి వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు గమనించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులపై ప్రమాదంగా మారే అవకాశం ఉందని, ప్రజలు ఈవిషయంలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
టీజీవో ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ జగన్మోహన్రావు మాట్లాడుతూ కార్మిక పక్షపాతి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. 2014 నుంచి ఆదాయ పన్ను రాయితీ పెంచాలని కేంద్రానికి విన్నవించుకున్నా పెంచ లేదన్నారు. నిజాయితీగా పన్నులు కట్టేది ఉద్యోగులు, కార్మికులేనన్నారు. టీఎన్జీవో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ కార్మికుల్లో చైతన్యం తేవడానికి ఈ కార్మిక చైతన్య మహోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ మాట్లాడుతూ కార్మిక ఉద్యోగులు ఎకువ ఉన్నది ఒక వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోనే ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీతో వేతనాలు పెరిగినా రెండు మూడు నెలల వేతనం ఆదాయ పన్ను కడుతున్నామని చెప్పారు. టాక్స్ పెంచాలని, సీపీఎస్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, టీఎన్జీవో కేంద్రం సంఘం కార్యదర్శి రాయికంటి ప్రతాప్, ఎల్ఐసీ, విద్యుత్, వివిధ జిల్లాల టీఎన్జీవో నాయకులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు.