కాజీపేట, మే 21 : నగరంలోని కార్మికులతో దాస్యం కుటుంబానికి నాలుగు దశాబ్దాలకు పైగా విడదీయరాని బంధం ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పట్టణంలోని పలు కూలీల అడ్డాల్లో శనివారం ఆయన కళాకారులతో కలిసి కార్మికులను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని వర్గాల కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా దాస్యం కుటుంబం పని చేస్తుందన్నారు. ప్రతి ఏడాది మే 1 నుంచి 31 వరకు కార్మిక చైతన్య మాసోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. కార్మికులు, కార్మిక కుటుంబాల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పట్టణంలో ఈ నెల 31న నిర్వహించే కార్మిక చైతన్య మాసోత్సవ ముగింపు సభకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నారని, ఆ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో 61వ డివిజన్ కార్పొరేటర్ ఎలకంటి రామలు, టీఆర్ఎస్ 62వ డివిజన్ అధ్యక్షుడు పాలడుగుల శివకుమార్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు సుంచు కృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు తేలు సారంగపాణి, ఆటో యూనియన్ నాయకుడు గడ్డం నరహరి పాల్గొన్నారు.
ఆరోగ్యం, అభివృద్ధే లక్ష్యంగా వాక్ అండ్ టాక్
హనుమకొండ : ఆరోగ్యం, అభివృద్ధే లక్ష్యంగా వాక్ అండ్ టాక్ విత్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. వాక్ అండ్ టాక్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం (ఏకశిల పార్కు)లో వాకర్స్తో వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పార్కు సమీపంలో ప్రతి రోజు పెట్రోలింగ్ చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అకడికి సమస్యలతో వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రెడ్ల మహా సంగ్రామం పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్లో ఈ నెల 27న నిర్వహించనున్న రెడ్ల మహా సంగ్రామం పోస్టర్ను ఏకశిల పార్కులో వినయ్భాస్కర్ ఆవిష్కరించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డి, జిల్లా నాయకులు గట్ట మహిపాల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాంగోపాల్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, సుగుణాకర్రెడ్డి, రఘుపతిరెడ్డి, దశరథరాంరెడ్డి, రాజిరెడ్డి, ప్రసాద్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్పై ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సోషల్ మీడియా వారియర్స్తో చీఫ్ విప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలని కోరారు.