హనుమకొండ, మే 15 : విభజన చట్టం హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు, వాటాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడలేని చేతగాని దద్దమ్మలు రాష్ట్ర బీజేపీ నాయకులని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించిన సభలో బీజేపీ నాయకులు అమిత్షా, కిషన్రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విలేకరులతో మాట్లాడారు.
సభలో బీజేపీ నాయకులు భారత్ మాతాకీ జై అన్నారు సరే… ఒక్కరైనా జై తెలంగాణ అన్నారా.. అంటే బీజేపీ నాయకులకు తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ లేదని మరోసారి బయటపడిందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చామన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు, ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. 8 సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందని పార్లమెంట్లో మీరే ప్రకటించారన్నారు. అలాగే మిషన్ భగీరథ పథకానికి రూ.19 వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ సూచిస్తే ఇచ్చారా అని ప్రశ్నించారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు వచ్చిన అవార్డులు ఏ రాష్ర్టానికి రాలేదన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధుల కోతపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి రూ.98 వేల కోట్లు ఉండగా ఇప్పుడు రూ.73 వేల కోట్లకు కుదించారన్నారు. ఈజీఎస్కు కిషన్రెడ్డి రూ.30 కోట్లు ఇచ్చామంటే.. అమిత్షా రూ.18 కోట్లు ఇచ్చామని అంటున్నారంటే ఎంత ఇచ్చారో వారికే స్పష్టతలేదని మంత్రి ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఎంత ఇస్తే రాష్ట్రం కూడా అంతే ఇస్తుందన్నారు. మూడు నెలల నుంచి ఉపాధి హామీ నిధులు మంజూరు చేయడం లేదన్నారు. దేశానికి కేసీఆర్ ఆదర్శవంతమైన సీఎం అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
బీజేపీ నాయకులవి బోగస్ మాటలు..
బీజేపీ నాయకులవి బోగస్ మాటలని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. బండి సంజయ్ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం మరిచిందన్నారు. గిరిజన యూనివర్సిటీకి ములుగులో 335.04 ఎకరాలు, సైనిక్ సూల్కు ఎల్కతుర్తిలో 49.32 ఎకరాల స్థలాన్ని కేటాయించినా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ముందుగా 50 ఎకరాలు, తర్వాత 100 ఎకరాలు అడిగితే 152.36 ఎకరాల స్థలం అప్పగించామన్నారు. స్థలం కేటాయించిన తర్వాత మొదట యూపీకి, తర్వాత గుజరాత్కి తరలించుకుపోయారన్నారు. ఇప్పుడు కాజీపేటకు డబ్బాలు కడిగే ప్రాజెక్టు ఇచ్చారని చెప్పా రు. రూ.34,900 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించి రైతులపై భారం మోపిందని మంత్రి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, నిధులు అడిగినా ఇవ్వలేదన్నా రు. ఐఐఎం, కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని మంత్రి మండిపడ్డారు. దేశంలో 155 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 3 మెడికల్ కాలేజీలుంటే ఇప్పుడు 33 కాలేజీలు సొంతంగా పెట్టుకున్నాం అని మంత్రి తెలిపారు. కేసీఆర్కు బండి సంజయ్ సరి తూగుతాడా? దేశ తలసరి ఆదాయం కంటే మన తలసరి ఆదాయం చాలా ఎకువగా ఉందన్నారు. వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3 లక్షల కోట్లు కడితే రాష్ట్రానికి ఇచ్చినవి రూ.లక్షన్నర కోట్లు మాత్రమేనని చెప్పారు. రైతులు ఎదురు తిరిగితే ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి చట్టాలను రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చుకున్న తెగువ మాది.. తెలంగాణను కాపాడుకోవడం ఎలాగో మాకు బాగా తెలుసన్నారు. తెలంగాణ గాంధీ కేసీఆర్ అని, ఆయన కుటుంబం అంతా తెలంగాణ కోసం త్యాగం చేసిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీల రిజర్వేషన్లు కేంద్ర పరిధిలోనివని, ఏనాడో అసెంబ్లీ తీర్మానం పంపించామన్నారు. ఇప్పటికైనా బీజేపీ రాష్ర్టాన్ని బ్లేమ్ చేసే గేం మార్చుకోవాలని మంత్రి హితవు పలికారు.
రైతు బిడ్డ కేసీఆర్ వ్యవసాయం చేయొద్దా?
అమిత్షా, కిషన్రెడ్డి, బండి సంజయ్కు వ్యవసాయం గురించి తెలువదు.. రైతు బిడ్డ కేసీఆర్ సీఎం అయితే వ్యవసాయం చేసుకోవద్దా..కేసీఆర్ది ఫాంహౌస్ కాదు.. అది ఫార్మర్ హౌస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టేందుకే రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయిస్తున్నారు.. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వస్తే పరిష్కరిస్తామని, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టాలని చూసే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేని కేంద్రం : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సన్నాసుల సంఘానికి అధ్యక్షుడిగా బండి సంజయ్ వ్యవహరిస్తున్నాడని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం ఓర్వలేక విద్వేషం, విషం కకుతున్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ మాదిరిగా అభివృద్ధి జరుగుతుందా.. దేశంలో 10 కి 10 మొదటి ఆదర్శ గ్రామాలు తెలంగాణవేనన్నారు. అలాగే, దేశంలో 20 ఉత్తమ గ్రామాలు ఎంపికైతే అందులో 19 గ్రామాలు తెలంగాణవేనని ఎమ్మెల్యే అన్నారు. కేసీఆర్ బీమా ఇచ్చి ఆదుకున్నారని, మీరేమి చేశారని సంజయ్ను ఓ మహిళ నిలదీసినప్పుడే నీ సంగ్రామ యాత్ర బండారం బయట పడింది అన్నారు. కేసీఆర్ ఎకడ ఉన్నా బుల్లెట్ దిగిందా? లేదా? అన్నట్లుగా పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గుండు అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదు, ఒక చాన్స్ ఇవ్వమని అడుకుంటున్న తీరు జాలేస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన అనడం కాదు.. నలుగురు నాలుగు స్తంభాలుగా బలంగా ఉన్నారని హెచ్చరించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలు తరిమి కొట్టడం ఖాయం అన్నారు.
అబద్ధాల వర్సిటీకి వీసీ అమిత్షా
– ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
అబద్ధాల యూనివర్సిటీకి అమిత్షా వీసీ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్బంగా అమిత్షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రాష్ర్టానికి రావాల్సిన వాటాలు తేవడంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విఫలం అయ్యారన్నారు. దమ్ముంటే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయకపోవడం కేంద్రం తప్పిదమేనన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన బీజేపీని హెచ్చరించారు.