వరంగల్, మే 15(నమస్తేతెలంగాణ) : ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను పల్లెలు, పట్టణాల్లో విజయవంతంగా నిర్వహించడానికి సమాయత్తం కావాలని కొద్దిరోజుల క్రితమే అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసింది. ముఖ్యంగా వైకుంఠధామాలు, డంపింగ్యార్డుల వినియోగం, డంపింగ్ యార్డుల వద్ద తడి, పొడి చెత్తను వేరుచేయడం, తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ, శానిటేషన్, కరంటు, నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. ఈ నెల 18న హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగనుంది. సమావేశానికి మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ, అటవీశాఖ అధికారులు, మేయర్లు, కమిషనర్లు తదితరులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాల అమలుపై నివేదిక తయారు చేసే పనిలో తలమునకలయ్యారు. ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి పురోగతి వివరాలను సేకరిస్తున్నారు.
సాధించిన ప్రగతి నివేదిక..
ప్రభుత్వ ఆదేశాలతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు అధికారులు రంగంలోకి దిగారు. కలెక్టర్ బీ గోపి కొద్ది రోజుల క్రితం నర్సంపేట, వరంగల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో వేర్వేరుగా సమావేశమై పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణపై సూచనలు చేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో 2019 సెప్టెంబర్ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సాధించిన ప్రగతి నివేదిక తయారు చేస్తున్నారు. ఆయా జీపీల పరిధిలో ఉన్న మొత్తం కుటుంబాలు, పంచాయతీ సిబ్బంది, గ్రామంలో ఉన్న రోడ్లు, మురుగు కాల్వలు, వీటిలో ప్రతిరోజూ శుభ్రం చేస్తున్న రోడ్లు, డ్రెయిన్లు, చదును చేసిన ప్రదేశాలు, ఇంకా పూడ్చాల్సిన ప్రదేశాలు, కూలిపోయిన, శిథిలావస్థకు చేరిన ఇండ్లు, వాటిలో పడగొట్టిన, తొలగించిన ఇండ్లు, ఇంకా పడగొట్టాల్సిన, తొలగించాల్సిన ఇండ్లు, పూడ్చిన బావులు, పూడ్చాల్సి ఉన్న బావులు, శుభ్రం చేసిన ఖాళీ స్థలాలు, ఇంకా శుభ్రం చేయాల్సిన ఖాళీ స్థలాలు, పూడ్చిన బోరు బావులు, పూడ్చాల్సి ఉన్న బోరు బావుల వివరాలను నివేదికలో పొందుపరుస్తున్నారు. డంపింగ్యార్డు ప్రస్తుత పరిస్థితి, తడి, పొడి చెత్త వేరు చేయడం మొదలైందా?, యార్డు ఉపయోగంలోకి వచ్చిందా?, తడి చెత్తను కంపోస్టుగా తయారు చేయడం జరుగుతున్నదా?, వర్మీ కంపోస్టు అమ్మకం ద్వారా ఎంత ఆదాయం సమకూరింది?, రోజుకు ఎంత విక్రయిస్తున్నారు?, బయో ఫెన్సింగ్ ఉందా అనే సమాచారాన్ని కూడా పంచాయతీ కార్యదర్శులు ప్రగతి నివేదికలో పేర్కొంటున్నారు. వైకుంఠధామం నిర్మాణం పూర్తయిందా?, వినియోగంలోకి వచ్చిందా?, విద్యుత్, నీటి సరఫరా సౌకర్యం, వైకుంఠధామం చుట్టూ బయో ఫెన్సింగ్ ఉందా అనే వివరాలనూ నివేదికలో నమోదు చేస్తున్నారు.
ఇతర అంశాలపైనా..
తెలంగాణకు హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్, ఇనిస్టిట్యూషనల్, కమ్యూనిటీ ప్లాంటేషన్స్, పల్లె ప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనం, మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలో ప్రస్తుత సీజన్ కోసం అందుబాటులో ఉన్న మొక్కలు, మొక్క రకం, వాటి సంఖ్య, గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నదా?, ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన నిధులెన్ని వంటివీ సేకరిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో భాగంగా వంగిన, తుప్పుపట్టిన స్తంభాలు, మార్చిన స్తంభాల సంఖ్య, ఇంకా మార్చాల్సిన ఉన్న స్తంభాలు, కావాల్సిన థర్డ్ వైర్ వివరాలను కూడా నివేదికలో పొందుపరుస్తున్నారు. 2021 ఏప్రిల్ నుంచి నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ సమావేశాలు, గ్రామ సభలు, నిర్వహించిన సమావేశాలు, సభల సంఖ్యనూ పేర్కొంటున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు, ట్రాక్టర్ లోన్ మొత్తం, నెలవారీ వాయిదా, గత మార్చి 31 వరకు చెల్లించిన లోన్, ఇంకా చెల్లించాల్సి ఉన్న రుణం, పంచాయతీ సిబ్బంది వేతనాల చెల్లింపు, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జారీ చేసిన జాబ్ కార్డులు, ఉపాధి కల్పించిన కూలీల సంఖ్య, పంచాయతీ ఆదాయం, ఖర్చుల్లో భాగంగా ప్రభుత్వ నిధులు, సొంత ఆదాయంతో పాటు పారిశుధ్యం, వీధి దీపాలు, మంచినీటి సరఫరా, పనులు, వేతనాల వివరాలను నివేదికలో నమోదు చేస్తున్నారు. 2021 ఏప్రిల్ నుంచి చేపట్టిన పనుల అంచనా వ్యయం, పని ప్రస్తుత స్థితి, ఖర్చు వివరాలను కూడా గ్రామ పంచాయతీ వారీగా పొందుపరుస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ నివేదికలను తయారు చేసే పనిలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారి స్వరూప వెల్లడించారు.