తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తేనే గిరిజన, దళితవాడలు బాగుపడుతాయన్న కేసీఆర్ లక్ష్యం అక్షరాలా నిజమైంది. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని చినమడూరు పరిధిలో శివారు తండాగా ఉన్న బంజర తండా స్వరాష్ర్టాన స్వతంత్ర ప్రతిపత్తి సాధించింది. ఇన్నాళ్లూ వెనుకబాటును చవిచూసిన ఈ ప్రాంతం జీపీగా ఆవిర్భవించి ప్రగతి పథాన దూసుకుపోతోంది. అభివృద్ధి పనులతో పాటు సంక్షే మ పథకాల ఫలాలను ప్రజలకు అందిస్తోంది. మండలంలోనే మొదట 60శాతం మందికి దళితబంధు అమలుకావడంతో పాటు 70కుటుంబాలకు కల్యాణలక్ష్మి, 20 మందికి సీఎంఆర్ఎఫ్ సాయం అందింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ సహకారం, దాతల పెద్దమనసు, రాజకీయాలకతీతంగా పాటుపడే ప్రజల అండతో పల్లెప్రగతి పనుల్లో మొదటిస్థానంలో నిలిచి పచ్చదనం సంతరించుకుంది. అలాగే వంద శాతం ఇండ్లకు మిషన్ భగీరథ నీరు అందుతుండగా, 95శాతం ఇండ్లలో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లతో బంజర ఆదర్శంగా నిలుస్తోంది.
– దేవరుప్పుల, మే 15
కొత్త జీపీగా ఏర్పడిన బంజరలో గిరిజనులతో పాటు దళితులు, బీసీలు ఉన్నారు. జనగామ-సూర్యాపేట జాతీయ రహదారికి సమీపంలో ఈ గ్రామం ఉండగా పంచాయతీరాజ్శాఖ బీటీ రోడ్డు ఈ గ్రామం మధ్య నుంచి విస్తరించి ఉంది. తూర్పు-దక్షిణం వైపు వాయిలాల చెరువు, మూడు దిక్కులు మండలంలోని పెదమడూరు, చినమడూరు, సింగరాజుపల్లి, పడమర వైపు లింగాలఘనపురం మండలంలోని నేలపోగుల, వనపర్తి శివార్లు ఉన్నాయి. గ్రామ జనాభా 998. కుటుంబాలు 220 ఉండగా పురుషులు 540 మంది, స్త్రీలు 410 మంది. 586 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో బంజర మల్లన్న జాతర ఏటా వైభవంగా జరుగుతుంది.
జీపీకి మూడెకరాలు ఇచ్చిన వైశ్యులు
బంజర జీపీగా ఏర్పడిన సమయంలో గ్రామంలో ప్రభుత్వ భూమి అసలే లేదు. దీంతో పల్లె ప్రగతి అమలు కష్టమైంది. అయితే శివారులో వైశ్యుల భూములుండగా వాటిని గ్రామ అభివృద్ధి కోసం ఇవ్వాలని గ్రామస్తులంతా కలిసి అడుగడంతో వారు కూడా అంగీకరించారు. గ్రామానికి ఆనుకుని ఉన్న కోటి రూపాయల విలువజేసే 3.15 ఎకరాలను గ్రామం కోసం రాసిచ్చారు. ఈ స్థలం పోకల సత్తయ్య, అంతయ్య, రామయ్య, విశ్వనాథం, లక్ష్మీనారాయణకు చెందినది కాగా వారి వారసులు పోకల గణేశ్, సోమయ్య, కొండ ఉప్పన్న, పోకల అంజయ్యలు గ్రామానికి విరాళంగా ఇచ్చారు. ఇదే స్థలంలో నేడు పల్లె ప్రగతి పనుల అమలు సాధ్యమైంది. ఈ స్థలంలో పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డు, గ్రామ పంచాయతీ భవనం, నర్సరీ, హనుమాన్ ఆలయం నిర్మించారు. దాతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఘనంగా సన్మానించి అభినందించారు.
‘మన ఊరు-మన బడి’కి పాఠశాల ఎంపిక
గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉండగా అధికారులు ‘మన ఊరు-మన బడి’కి ఎంపిక చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్ధాయి మౌలిక వసతులతో ఆంగ్ల విద్యాబోధన ప్రారంభం కానున్నది. రూ.కోటి అంచనాతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేసేందుకు అంచనాలు రూపొందించారు. ఇది ప్రారంభమైతే గ్రామంలోని తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా సర్కారు బడికే పంపుతామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ప్రప్రథమంగా ఇక్కడే దళితబంధు..
దేవరుప్పుల మండలంలోని ప్రప్రథమంగా బంజర గ్రామంలో దళితబంధు అమలైంది. గ్రామంలో 28దళిత కుటుంబాలు ఉండగా మొదటి విడతలో భాగంగా 15 కుటుంబాలకు దళితబంధును అమలు చేసి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలతో ఉపాధి అవకాశాలు కల్పించారు. కాగా మంత్రి ఎర్రబెల్లి సూచనల మేరకు గ్రామంలో దళితులంతా గ్రామసభ ఏర్పాటు చేసుకొని ఎలాంటి అరమరికలు లేకుండా మొదటి విడతలో ఫలానా కుటుంబాలు దళిత బంధును తీసుకుకోవాలని స్వయంగా నిర్ణయించుకోవడం విశేషం. దళితబంధు కింద హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, డోజర్, సెంట్రింగ్ మెటీరియల్, బట్టల దుకాణం, టెంట్హౌస్, పాడిపరిశ్రమ నెలకొల్పారు.
గ్రామం అభివృద్ధిలో ముందుంది..
నాది కాంగ్రెస్ పార్టీ అయినా ఉన్నదున్నట్టు చెబుతా. కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ బంజర అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ఈ మూడున్నర ఏళ్లలో ఊహించని అభివృద్ధిని కళ్లారా చూశాం. తాగునీటి సమస్య తీరింది. ఇంటింటికీ నల్లా వచ్చింది. వాడవాడలా సీసీరోడ్లు వచ్చాయి. జీపీ భవనం ఇంత తొందరగా పూర్తవుతుందని ఊహించలే. ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి. ఇదంతా కేసీఆర్ ఘనతే. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి చొరవ, గ్రామ సర్పంచ్ కృషితో బంజర అన్నింటా ముందున్నది.
– మాలోత్ చందర్, కాంగ్రెస్ నాయకుడు
‘పల్లె ప్రగతి’లో ఫస్ట్ ఉన్నాం
పల్లె ప్రగతి అమలులో మండలంలోనే ఫస్టున్నాం. ఆరు నెలల్లోనే గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తిచేశాం. తడి, పొడి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ షెడ్డులో సేంద్రియ ఎరువు తయారీ జరుగుతోంది. ఈ ఎరువు హరితహారం మొక్కలకు వేస్తున్నాం. హరితహారం మొక్కలను వంద శాతం బతికించాం. గ్రామస్తుల సహకారం, సర్పంచ్ చురుకుదనంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. దళితబంధు పథకం మొట్టమొదట ఈ గ్రామానికే రావడం బంజర దళితుల అదృష్టం. అధికారుల సహకారంతో అభివృద్ధిలో ముందువరుసలో ఉన్నాం.
– క్రాంతికుమార్, పంచాయతీ కార్యదర్శి
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
తండాలను గ్రామ పంచాయతీలు చేసిన క్రమంలో బంజర జీపీ అయింది. నేను తొలి సర్పంచ్గా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నా. గ్రామంలో రాజకీయాలకతీతంగా పనులు జరుగుతున్నాయి. గ్రామాభివృద్ధి విషయంలో అందరి సహకారం ఉంది. మొదటిసారి గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ బంజర.. మంత్రి ఎర్రబెల్లి సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రభుత్వ భూమి ఏమాత్రం లేకున్నా దాతలు 3.15 ఎకరాలు దానం ఇవ్వడం మాకు కలిసొచ్చింది. వారికి సదా రుణపడి ఉంటాం. వారి భూమిలోనే పల్లె ప్రగతి పనులు చేశాం. గ్రామపంచాయతీ నిర్మించుకున్నాం. రూ. కోటితో వాడవాడలా సీసీరోడ్లు వేశాం. మంత్రి తన సీడీఎఫ్ నుంచి మంజూరుచేసిన రూ.20 లక్షలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామూహిక భవనాలు కట్టించాం. రాజకీయాలకతీతంగా 70 కుటుంబాలకు కల్యాణలక్ష్మి అమలైంది. మరో 20 మందికి సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందింది.
– మాలోత్ కవిత, సర్పంచ్
దళితబంధుతో మా కుటుంబాల్లో వెలుగు
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలైనా దళితుల ఆర్థిక స్థితిగతులు మారలేదనే విషయాన్ని గమనించి సీఎం కేసీఆర్.. మా కుటుంబాల కోసం దళితబంధు పథకాన్ని అందించారు. ఇది మా జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. నేను డిగ్రీ చేసి గ్రామంలోనే కూలీనాలీ చేసుకునేది. దళితబంధు ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చేసింది. ఈ పథకం కింద ట్రాక్టర్ తీసుకున్నా. ఇప్పుడు నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పులు కూడా తీరుతాయి. కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ పథకం తెలంగాణలోని దళితులను తలెత్తుకునేలా చేస్తుందని ఆశిస్తున్నా.
– సంగా కళాధర్, దళితబంధు లబ్ధిదారు