సాధారణంగా రైతులు రెండు పంటలు పండించడం పరిపాటి. అన్నిరకాలుగా నీటి సౌకర్యం ఉండి, భూములు అనుకూలంగా ఉంటే తప్ప మూడో పంట జోలికి వెళ్లరు. అది కూడా ఎండాకాలంలో పత్తి అసలే వేయరు. కానీ దంతాలపల్లి మండలం గున్నెపల్లిలో ఎకరంలో రెండు పంటలు వరి వేసిన వీరనర్సయ్య.. యాసంగిలోనూ పత్తి పండించాలని ధైర్యంతో చేసి మార్చిలో మూడో పంట వేశాడు. ఇప్పుడు ఏపుగా పెరిగి కాయ దశకు రావడంతో మిగతా రైతుల్లో ఆసక్తి పెంచింది. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు భూమిని ఖాళీగా ఉంచడం ఎందుకని ప్రయోగాత్మకంగా పంట వేశానని.. 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని సంతోషగా చెబుతున్నాడు.
దంతాలపల్లి, మే 15 : రాష్ట్రంలో పత్తిని వానకాలం పంటగానే వేస్తారు. తొలకరిలో విత్తనాలు వేస్తే దీపావళి నాటికి పత్తి పంట పూర్తిగా చేతికొస్తుంది. ఇందుకు భిన్నంగా వేసవిలోనూ పత్తి సాగుచేశాడో రైతు. వానకాలంలోనే కాదు.. యాసంగిలోనూ పత్తితో మంచి దిగుబడి సాధించవచ్చని నిరుపిస్తున్నాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నెపల్లి గ్రామానికి చెందిన రైతు పోన్నోటి వీరనర్సయ్య. గున్నెపల్లి స్టేజీ వద్ద తనకున్న ఎకరం వ్యవసాయ భూమిలో రెండు పంటలు వరి సాగు చేసి మూడో పంటగా పత్తిని సాగుచేస్తున్నాడు. యాసంగిలో వరి ముందస్తుగా సాగుచేయడంతో మార్చిలోనే పంట చేతికొచ్చింది. తర్వాత వ్యవసాయ భూమిని ఖాళీగా ఉంచడం ఎందుకని ఆలోచన వచ్చింది. పత్తి వానకాలంలోనే పండుతుండా? ఎండాకాలం ఎందుకు వేయకూడదు.. నీటి సౌకర్యం కూడా ఉంది కదా! ఓసారి ప్రయోగం చేద్దామని ధైర్యం చేసి పత్తి వేశాడు. వెంటనే పత్తి గింజలు నాటాడు. ప్రతిరోజూ బోరుతో నీళ్లు పెట్టాడు.
సకాలంలో నీరందించడంతో ప్రస్తుతం పత్తి కాయ దశకు వచ్చింది. ఎప్పుడు, ఎక్కడా లేని విధంగా వినూత్నంగా ఎండాకాలంలో వీరనర్సయ్య పత్తి వేయడం చూసి మండలంలోని రైతులు పంటను ఆసక్తిగా చూస్తూ సెల్ఫోన్లలో ఫొటోలను తీసుకుంటున్నారు. ఎండాకాలంలో పత్తిపంట సాగుచేడం ఏమిటని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతేకాదు.. పంట ఇప్పటివరకు ఎలాంటి చీడపురుగు ఆశించకపోవడమే గాక ఏపుగా పెరిగింది. ఇదివరకు ఇదే భూమిని నీటి సౌకర్యం లేక బీడు ఉంచగా.. కేసీఆర్ సర్కారు కాళేశ్వరం నీటిని ఎస్సారెస్సీ కాల్వల ద్వారా చెరువులు, కుంటలు, వాగులు నింపుతుండడంతో బోర్లలో జలాలు సమృద్ధిగా వస్తున్నాయి. అందుకే వీరనర్సయ్య ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పంటలు వేస్తున్నాడు.
ఒకసారి చూద్దామని వేశా..
యాసంగిలో పత్తి వేసి చూద్దామనే ఆలోచనతో ఒకసారి పంట వేద్దామని అనుకున్నా. ఎకరంలో పత్తిగింజలు పెట్టిన ఇప్పటి వరకు రూ.30వేల ఖర్చు వచ్చింది. వానకాలం కంటే ఇప్పుడే పంట మంచిగ వస్తుంది. కాయదశలో ఉంది. ఎకరాకు 10నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అనుకుంటున్నా. వేసవిలో పత్తి వేస్తే నీటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలని తెలుసుకున్నా. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు భూమిని ఖాళీగా ఎందుకు ఉండాలని పత్తి వేసిన. మంచి ఫలితమే వస్తుంది అనిపిస్తుంది.
– పోన్నోటో వీరనర్సయ్య, రైతు, గున్నెపల్లి
ఆలోచన మంచిదే..
వేసవికాలంలో పత్తి సాగుచేయడం మంచి ఆలోచనే. మంచి దిగుబ డి వస్తుంది. ఈ భూమిలో రెండు పంటలు సాగుచేసి మూడో పంట వేయడంతో ఎలాంటి తెగుళ్లు, రోగాలు వచ్చే అవకాశం ఉండదు. రైతు వీరనర్సయ్య ఆలోచన మంచిదే. రైతులందరూ మూడో పంటగా అంత ర్గత పంటలపై దృష్టిపెట్టాలి. పత్తికి ప్రధానంగా గులాబీ రంగు పురుగు వ్యాప్తిస్తుంది. వేసవిలో సాగుచేసే పత్తిపై దీని ప్రభావం తక్కువే. ఇలాంటి పంటలను వ్యవసాయ శాఖ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది..
– దీక్షిత్కుమార్, ఏఈవో, దంతాలపల్లి