వరంగల్ చౌరస్తా, మే 14: హనుమకొండ జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం దవాఖానలో సేవలందిస్తున్న డిస్ట్రిక్ ఎర్నీ ఇంటర్వెన్షన్ సెంటర్(డైక్)లో గందళగోళం నెలకొంది. పిల్లల్లో వినికిడి లోపాలను గుర్తించి వైద్య సేవలు అందించడానికి అసవరమైన యంత్రాలను కొనుగోలు చేయడానికి 2018లోనే నిధులు మంజూరు చేశామని రాష్ట్ర ఉన్నతాధికారులు చెబుతుండగా.. ఆ సమయంలో మేమిక్కడ విధులు నిర్వర్తించలేదని, 2018 రికార్డులను పరిశీలించి నిర్ధారించుకుంటామని జిల్లా వైద్యాధికారులు అంటున్నారు. పిల్లల్లో వినికిడి సమస్యను పరిష్కరించడానికి నిర్వహించే కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సలు హైదరాబాద్లోనే కాకుండా వరంగల్ ఎంజీఎంలో సైతం నిర్వహించాలని ఇటీవల హనుమకొండ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు.
దీంతో అధికారులు యంత్ర పరికరాలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎంజీఎం సూపరింటెండెంట్తోపాటు ఈఎన్టీ విభాగం వైద్యులు కోరారు. శస్త్రచికిత్సలు నిర్వహించడానికి అవసరమైన అన్ని యంత్ర పరికరాలు ఉన్నట్లు మంత్రికి ముందస్తు సమాచారం ఉండడంతో ఆయన డీఎంఈ రమేశ్రెడ్డిని వివరణ కోరారు. వెంటనే స్పందించిన డీఎంఈ 2018లో అందుకు సంబంధించిన యంత్ర పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేసినట్లు వివరణ ఇవ్వడంతో కలెక్టర్ గోపి వైద్యాధికారులను విచారణకు ఆదేశించారు.
కనిపించకుండాపోయిన యంత్రాలు
సమీక్ష నిర్వహించిన మరుసటి రోజు ఎంజీఎం వైద్యాధికారులు డైక్ సెంటర్ను సందర్శించి యంత్రాలు కనిపించకుండా పోవడంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అసలు విషయాన్ని విచారించి నిజానిజాలు వెలికితీయాలని అధికారులు ఆదేశారు జారీ చేయడంతో విచారణ జరుపనున్నారు. ఈ విషయమై హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావును వివరణ కోరగా, 2018లో నిధులు మంజూరు చేసిన రికార్డులను పరిశీలించనున్నట్లు తెలిపారు. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో సోమవారం రికార్డులను పరిశీలించి, నిధులు మంజూరయ్యయా.. నిధుల మళ్లింపు జరిగిందా.. అత్యవసర నిమిత్తం ఇతరత్రా యంత్రాల కొనుగోలు జరిగిందా లేక యంత్రాలు కొనుగోలు చేయకుండానే బిల్లులు సమర్పించి నిధుల దుర్వినియోగం జరిగిందా, కొనుగోలు చేసి ఉంటే యంత్రాలు ఎక్కడున్నాయనే అంశాలపై విచారణ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రి ఆదేశాల మేరకు ఎంజీఎంలో కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అత్యవసరంగా యంత్రాలు కొనుగోలు జరిపైనా సరే.. వినికిడి లోపాలు కలిగిన పిల్లలకు వైద్యసేవలు అందించాలని ఆదేశాలు ఉండడంతో అధికారులు అందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.