వరంగల్, మే 10: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 24 గంటల్లోనే సర్టిఫికెట్ అందించే ప్రక్రియను చేపట్టింది. సర్టిఫికెట్ల జారీలో గతంలో ఉన్న ప్రకియను పూర్తిగా మార్చివేసింది. జనన, మరణ సమాచారాన్ని గంటల వ్యవధిలోనే దవాఖాన వర్గాలు ఆన్లైన్ చేసేలా ఏర్పాట్లు చేశాయి. అందుకోసం బల్దియా అధికారులు నగరంలోని 142 దవాఖానలకు యూజర్ ఐడీ, పాస్వర్డ్లను కేటాయించారు. గృహాల్లో మరణించిన వారి సమాచార నమోదు కోసం నగరంలోని 148 శ్మశానవాటికల బాధ్యతలను జవాన్లకు అప్పగించారు. రోజు వారీగా సమాచారం ఆన్లైన్లో నమోదు చేసేలా వారికి అవగాహన కల్పించారు. ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో తీసుకొచ్చిన కొత్త విధానంతో ఒక్క రోజులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు.
గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో నమోదు
కార్పొరేషన్ పరిధిలో గంటల వ్యవధిలో జనన, మరణ సమాచారాలు ఆన్లైన్లో నమోదు అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో జరిగిన జనన, మరణాల వివరాలను ఆయా వర్గాలు వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నా యి. సమాచారం ఆన్లైన్లో నమోదైన వెంటనే సంబంధించిన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫోన్ సంబర్కు సమాచారం వెళ్తుంది. దీంతో సదరు వ్యక్తులు జనన ధ్రువీకరణ పత్రం కావాలనుకుంటే వెంటనే శిశువు పేరు నమోదు చేసుకుని ఈ సేవ ద్వారా 24 గంటల్లో సర్టిఫికెట్ తీసుకునే విధంగా ప్రభుత్వ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నది. అలాగే, మరణ ధ్రువీకరణ పత్రాలు సైతం ఒక్క రోజులో తీసుకునే అవకాశం ఉంది.
ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్
గ్రేటర్ పరిధిలోని 142 ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు అధికారులు యూజర్, ఐడీ పాస్వర్డ్లను కేటాయించారు. దీంతో దవాఖాన వర్గాలు ఏ రోజు వివరాలు అదే రోజు ఆన్లైన్ నమోదు చేస్తున్నారు. గతంలో వారం రోజులకు ఒకసారి ఆయా దవాఖాన వర్గాలు జనన, మరణాల సమాచారాన్ని బల్దియాకు అందించేవి. కొన్ని దవాఖానలు 15 రోజులు అయినా పంపించేవి కావు దీంతో సమాచారం ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం తో 24 గంటల్లోనే సర్టిపికెట్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో నెల రోజులుగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారు.
జవాన్లకు కొత్త బాధ్యతలు
గ్రేటర్ పరిధిలోని జవాన్లకు కొత్త బాధ్యతలను అప్పగించారు. గ్రేటర్లోని 148 శ్మశానవాటికల బాధ్యతలను జవాన్లకు అప్పగించారు. గృహాల్లో జరిగిన మరణాల వివరాలను శ్మశానవాటికల నుంచి సేకరించి ఆన్లైన్లో నమోదు చేసేలా జవాన్లకు అవగాహన కల్పించారు.