కరీమాబాద్, ఏప్రిల్ 6 : తెలంగాణలో పండిన వడ్లు మొత్తం కొనేదాకా సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంతో కొట్లాడుడేనని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు. బుధవారం నాయుడు పంపు జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగం కోసం సీఎం పోరాటం చేస్తున్నారన్నారు. కేంద్రం రాష్ర్టానికి చేస్తున్న అన్యాయంపై తెలంగాణ ఉద్యమాన్ని మించిన మరో ఉద్యమం చేయాలన్నారు. రైతులను కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే బీజేపీ రైతులకు అన్యాయం చేస్తున్నదన్నారు.
ఆ పార్టీకి రైతులే బుద్ధి చెబుతారన్నారు. పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణలో ఎందుకు కొనరో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలంటే మోదీకి అలుసా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్ర సర్కారుకు ఘోరీ కడతామన్నారు. కేంద్రం దిగిరాకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఢిల్లీలో పోరాటం చేస్తామన్నారు. కాగా, రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచాయి. దాదాపు 3 గంటల పాటు జంక్షన్లోని ఆరు దారుల్లో బైఠాయించారు. మామునూరు ఏసీపీ నరేశ్కుమార్, వరంగల్ ఏసీపీ గిరి, సీఐలు రమేశ్, శ్రీనివాస్ ఎలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, పోశాల పద్మ, సిద్ధం రాజు, ప్రవీణ్, కవిత, ఉమ, సువర్ణ, నరేందర్, సురేశ్, కుమారస్వామి, మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ, పల్లం రవి, కత్తెరశాల వేణుగోపాల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి..
ఈ నెల 7న ఓ సిటీ మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మె ల్యే నన్నపునేని కోరారు. జిల్లా కేంద్రంలో చేపట్టనున్న నిరసనలో నాయకులు భారీగా పాల్గొనాలన్నారు.