ఆత్మకూరు, ఏప్రిల్ 6 : దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపురం గ్రామంలో రూ.3కోట్లతో నిర్మించిన 60 డబుల్బెడ్రూం ఇండ్లను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సాహసోపేత నిర్ణయాలు, పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ముందువరుసలో నిలబెట్టారని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లతో పేదింటి సొంతింటి కల నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పెన్షన్ రూ.500లే ఇస్తున్నారని ఒక్క తెలంగాణలో రూ.2016, వికలాంగులకు రూ.3016 ఇస్తున్నది సీఎం కేసీఆరేనన్నారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ చేసిన అభివృద్ధిని పరిశీలించాలని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తిచేశారు. దేశంలో కరోనా వల్ల చాలా రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలను నిలిపివేశారని, కేవలం తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ నిరాటంకంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. త్వరలో ఇంటి స్థలం ఉన్న పేద వారికి ఇండ్లు కట్టించే ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అలాగే 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ నెల 12 నుంచి పెన్షన్ను ఇస్తున్నట్లు ప్రకటించారు. దళితల కోసం ప్రత్యేకంగా దళితబంధు పథకం ద్వారా రూ.10లక్షల ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ఒక్కటేనన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.25లక్షల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యం
– పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎం కేసీఆర్ కావడం ప్రజల అదృష్టమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయలేని సంక్షేమ, అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. 70 ఏళ్లలో జరుగని అభివృద్ధి సీఎం ముఖ్యమంత్రి అయ్యాక చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెడితే ఆ నాయకులే బినామీ పేర్లతో బిల్లులు డ్రా చేసుకొని దోచుకొని తిన్నారని ఆరోపించారు. కానీ సీఎం కేసీఆర్ పార్టీలకతీతంగా ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. ప్రజలంతా ఆయనకు అండగా ఉండాలని కోరారు. దళితుల అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదిగేందుకు రూ.10లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారన్నారు.
కేంద్రానికి గుణం పాఠం తప్పదు..
– జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
ఆరుగాలం కష్టంచి పంటలు పండించే అన్నదాతలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తే గుణంపాఠం తప్పదని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. యాసంగిలో తెలంగాణలో కేవలం దొడ్డు రకం వరి మాత్రమే సాగవుతుందనే విషయం తెలిసినప్పటికీ కి కేంద్రంలో బీజేపీ సర్కారు ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజంతా అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జీ ఆర్డీవో వాసుచంద్ర, ఎంపీపీ మార్క సుమలతారజనీకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, ఆత్మకూరు, పరకాల మార్కెట్ చైర్మన్లు బొల్లోబోయిన రాధారవియాదవ్, బండి సారంగపాణి, రెడ్ క్రాస్ డైరెక్టర్ దుంపల్లపల్లి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, సర్పంచ్లు వంగాల స్వాతీభగవన్రెడ్డి, రబీయాబీహుస్సేన్, కొరే లలితారమేశ్, సావురే కమలారాజేశ్వర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, రైతు మండల కో ఆర్డినేటర్ రవీందర్, ఆరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు బంధు జిల్లా, మండల కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
– కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన గ్రామాల్లో సైడ్ డ్రైనేజీలు, సీసీరోడ్లు నిర్మిస్తామని చెప్పారు. నియోజకవర్గానికి 1,413 డబుల్ బెడ్ రూములు మంజూరు కాగా, 384 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు కట్టించి ఇస్తున్నామన్నా రు. శాశ్వతంగా ఉండేందుకు రెవెన్యూ శాఖ నుంచి పట్టా అందజేస్తున్నామని వారి ఇంటిపై సంపూర్ణ హక్కు ఉంటుందన్నారు.
కలలో కూడా అనుకోలేదు
డబుల్ బెడ్రూమ్ ఉచితం గా వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మాలాంటి పేదలకు సొంతిళ్లు కట్టించి ఎంతో సాయం చేసిందీ ప్రభుత్వం. గూడు లేక పడే కష్టాలు పడే వారి కోసం సీఎం కేసీఆర్ మంచి పథకం పెట్టిన్రు. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటం. ఇల్లు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యదాదాలు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది.
– ఓన్నాల నాగమణి
చెప్పలేనంత సంతోషంగా ఉంది
ఇలా ఇల్లు ఇవ్వడం నేనెప్పుడూ చూడలేదు. పేదవాళ్లందరికీ ఒక దగ్గర ఇండ్లు కట్టించినందుకు గాను చెప్పలేనంత సంతోషంగా ఉంది. మా ఇంటికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టారు ప్రారంభించారు. ఇంతమంచి సర్కారు ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్కు మా దీవెనలు ఎప్పడూ ఉంటాయ్.
– మహ్మద్ అజీద బేగం
మనస్సున్న మారాజు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో పథకాలు పెట్టిండు. ఏదై నా అనుకుంటే సాధించి తీరుతాడు. చెప్పినట్టే పేదల కోసం ఇండ్లు కట్టించి ఇచ్చిండు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు మా గ్రామంపై ప్రత్యేకం చొరవ తీసుకున్నారు. 60 కుటుంబాలకు ఒక దగ్గర ఇండ్లు కట్టించడం చాలా సం తోషంగా ఉం ది. డబుల్ బెడ్ రూమ్ల ప్రారంభోత్సవం ఊ రంతా పండుగలా జరిగింది. అందరూ సంబురంతో ఉన్నారు.
– మాదరబోయిన లలిత