వరంగల్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీలో వర్గపోరు తీవ్రమవుతున్నది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏను గు రాకేశ్రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పశ్చిమ సెగ్మెంట్లో రాకేశ్రెడ్డి సొంతంగా కార్యక్రమా లు నిర్వహిస్తున్నారని, బీజేపీలో ఉండి పార్టీకే పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని రావు పద్మ పార్టీ రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ‘ఇండస్ స్వచ్చంధ సంస్థ’ పేరిట పశ్చిమ ని యోజకవర్గంలోనే రాకేశ్రెడ్డి సొంత కార్యక్రమాలు పెడుతున్నారని, బీజేపీతోపాటు పార్టీ అనుబంధ సం ఘాలకు సైతం సమాచారం ఇవ్వడంలేదని పేర్కొన్నా రు. హనుమకొండలో సొంతంగా కార్యాలయం తెరిచి పార్టీకి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. బీజేపీ సంస్థాగత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రాకేశ్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకులను కోరారు.
వరంగల్ పశ్చిమంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రాకేశ్రెడ్డి సొంత కార్యక్రమాలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర నేతలకు తెలిపా రు. బీజేపీలో ఏదైనా పార్టీ పరంగా జరుగాలని, ఇప్పు డు కొత్తగా వ్యక్తిగత కార్యక్రమాలు చేస్తున్నారని పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమంలో బీజేపీ నేతల సొంత ఎజెండాలతో ఆ పార్టీ శ్రేణులు అయోమయానికి లోనవుతున్నారు. ‘పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వారి కంటే.. రాద్ధాంతాన్నే సిద్ధాంతంగా చేసే వారి హడావుడి ఎక్కువైంది’ అని మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కొత్త నేతల వ్యవహారాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్గా పరిగణిలోకి తీసుకున్నదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాకేశ్రెడ్డికి త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.
వరంగల్లోనూ గ్రూపుల లొల్లి..
వరంగల్ జిల్లాలోనూ బీజేపీ నేతల అంతర్గత కు మ్ములాటలు తీవ్రమయ్యాయి. రెండేండ్ల క్రితం పార్టీ లో చేరిన కొండేటి శ్రీధర్కు బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై మొదటి నుంచీ పార్టీని అంటిపెకున్నవారు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జిల్లా అధ్యక్షుడు అయిన ఆ నేత తీరుపై సీనియర్లు అసంతృప్తిని బాహాటంగానే వెల్లడిస్తున్నారు. బీజేపీలో పాత నేతలంతా ఇటీవలే జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు వరంగల్, హనుమకొండగా మారిన తర్వాత పార్టీ ప రంగా పలు మార్పులు జరిగాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సిద్ధం నరేశ్ గతంలో బీజేవైఎం అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాడు. ఇటీవల ఆయనకు వరంగల్ జిల్లా బాధ్యతలు ఇవ్వాల్సి ఉండ గా పూర్తిగా తొలగించి కొత్త వారిని నియమించారు.
వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్ష పదవి నియమాకంలోనూ బీజేపీ అధ్యక్షుడు సొంతంగా నిర్ణయం తీసుకున్నారని పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్పై ఆ జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు రాష్ట్ర నా యకత్వానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ నిర్మాణం గురిం చి అవగాహన లేని వారి వల్లే పాత నేతలకు అన్యా యం జరుగుతున్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్ష పదవిపై త్వరగా సరైన నిర్ణయం తీసుకోకుంటే తాము బహిరంగంగా తేల్చుకుంటామని రాష్ట్ర నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఎవరికి వారుగా సొంత కార్యలయాలు నిర్వహిస్తుండడంపైనా పలువురు రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. ‘వడ్లు కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తుంటే.. బీజేపీలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు’ అని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తమ పార్టీ పరిస్థితిని వివరించారు.