వరంగల్, ఏప్రిల్ 2 : ఉగాది పర్వదినం సందర్భంగా భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రభు త్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ – రేవతి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు చీఫ్విప్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంత రం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి ఎరుపు, గులాబీ పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. అలాగే, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయం త్రం ఆలయ సిద్ధాంతి అయినవోలు అనంతమల్లయ్య పంచాంగ శ్రవణం చేశారు.
పోటెత్తిన భక్తులు..
ఉగాది సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో వసంతోత్సవాలు నిర్వహిస్తుండడంతో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
వేయిస్తంభాల ఆలయంలో వేడుకలు..
ఉగాది సందర్భంగా వేయి స్తంభాల ఆలయంలో పాశుపత, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. సీతారామచంద్ర స్వామి నవరాత్రోత్సవాలు ప్రారంభించారు. యాగశాలలో నవగ్రహ రుద్రసహిత మహాసుదర్శన హోమం నిర్వహించారు. 9 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రముఖ జ్యోతిష్య పండితుడు ఐనవోలు అనంతమల్లయ్య సిద్ధాంతి పంచాంగ శ్రవణం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు హాజరయ్యారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొని కవులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, బంగారు తెలంగాణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, ఆలయ ఈవో వేణుగోపాల్, కవులు పొట్లపల్లి శ్రీనివాస్రావు, వీఆర్ విద్యార్థి, బిల్లా మహేందర్ పాల్గొన్నారు.