కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయకుంటే పోరు ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. నాలుగోరోజు జిల్లాలోని పలు జీపీలు, పీఏసీఎస్లు, మండల పరిషత్లలో పాలకవర్గ సభ్యులు సమావేశమై ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించారు. కేంద్రం.. రాష్ట్రంపై వివక్ష చూపుతున్నదని ఖానాపురంలో జరిగిన పీఏసీఎస్ సమావేశంలో పాలకవర్గ సభ్యులు ధ్వజమెత్తారు. నర్సంపేట, నల్లబెల్లి, పర్వతగిరి మండల పరిషత్లు కేంద్రం తీరుపై మండిపడ్డాయి. రెండు పంటల ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశాయి. కేంద్రం మెడలు వంచే వరకూ పోరాటం ఆపబోమని ప్రతినబూనాయి. తీర్మాన ప్రతులను ప్రధాని మోదీకి పంపాయి. ఇదే అంశంపై రేపు జడ్పీ ప్రత్యేక సమావేశం జరుగనుంది.
వరంగల్, మార్చి 28(నమస్తేతెలంగాణ) : కేంద్రమే ధాన్యం కొనాలంటూ చేపట్టిన పోరు ఉధృతంగా సాగుతున్నది. ఇందులో భాగంగా సోమవారం ఖానాపురం పీఏసీఎస్ పాలకవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. సంఘం అధ్యక్షుడు, ఓడీసీఎంస్ చైర్మన్ రామస్వామీనాయక్ అధ్యక్షత వహించిన సమావేశంలో పీఏసీఎస్ డైరెక్టర్లు బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఓడీసీఎంఎస్ చైర్మన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. నర్సంపేట ఎంపీపీ మోతె కళావతి, నల్లబెల్లి ఎంపీపీ సునీత, పర్వతగిరి ఎంపీపీ లూనవత్ కమలాపంతులు అధ్యక్షతన మండల పరిషత్ల ప్రత్యేక సమావేశాలు జరిగాయి. వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని ప్రవేశపెట్టిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రైతులు పండించిన రెండు పంటల వడ్లను బేషరతుగా కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని పేర్కొన్నాయి. రాయపర్తి జీపీ ప్రత్యేక సమావేశం సర్పంచ్ గారె నర్సయ్య అధ్యక్షతన జరిగింది. తెలంగాణ రైతుల వడ్లను కొనుగోలు చేయాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులు డిమాండ్ చేశారు. సర్పంచ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానాల ప్రతులను పాలకవర్గం సభ్యులు ప్రధాని మోదీకి కొరియర్, పోస్టు ద్వారా పంపారు. అలాగే, జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన ఈ నెల 30న జరుగనుంది. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని అధ్యక్షతన నర్సంపేట మున్సిపాలిటీ పాలకవర్గ ప్రత్యేక సమావేశం జరుగనుంది.