కరీమాబాద్, మార్చి 24 : రైతాంగం పచ్చగుంటనే మనమందరం బాగుంటామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం కరీమాబాద్లోని రామ్ లక్ష్మణ్ గార్డెన్లో కార్పొరేటర్ పల్లం పద్మ అధ్యక్షతన వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పోరాడి సాధించిన తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోమన్నారు. కేంద్రం రాష్ర్టానికి చేస్తున్న అన్యాయంపై తెలంగాణ ఉద్యమాన్ని మించిన మరో ఉద్యమం చేయాలన్నారు. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేంద్రం పొలాల వద్ద మీటర్లు పెట్టాలని చూస్తున్నదన్నారు. మరో వైపు నిత్యావసర ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. వీటిపై బీజేపీ నాయకులను నిలదీయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారన్నారు. రాష్ట్రం హక్కులను కేంద్రం హరిస్తున్నదన్నారు. టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని, అన్ని మతాలు, కులాలను గౌరవిస్తున్నదన్నారు. బీజేపీ మాత్రం ప్రజల మధ్య మత చిచ్చు పెడుతున్నదన్నారు. కేసీఆర్ పేదల కోసం పని చేస్తుంటే మోదీ కార్పొరేట్ సంస్థల కోసం పని చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ, బస్తీ దవాఖాన, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ తదితర పథకాలతో ఆయన ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని, ఇకపై కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా బీజేపీపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఒక్కో డివిజన్లో 250 నుంచి 300 మందితో ఓ టీమ్ను ఏర్పాటు చేస్తానన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, కుడా సలహామండలి సభ్యుడు మోడెం ప్రవీణ్, కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణ, సిద్దం రాజు, పోశాల పద్మ, మరుపల్ల రవి, కవిత, ఉమ, సువర్ణ, నరేందర్, కుమారస్వామి, మాజీ కార్పొరేటర్లు నాగపురి కల్పన, కేడల పద్మ, బత్తిని వసుంధర తదితరులు పాల్గొన్నారు.