ఖిలావరంగల్, మార్చి 24 : దళితబంధు పథకం ద్వారా ఎంచుకున్న యూనిట్లలో లాభాలు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం వరంగల్ కలెక్టరేట్లో దళిత బంధు గ్రౌండింగ్ కమిటీ, అలాగే జిల్లా పరిషత్లో ట్రాన్స్పో ర్టు యూనిట్కు సంబంధించిన దళిత బంధు లబ్ధిదారులకు కలెక్టర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఫాం, సెంట్రింగ్ యూనిట్, టెంట్హౌజ్, ఎలక్రిక్టల్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ రిపేరింగ్, ఆటో ట్రాలీ, మెడికల్ జనరల్ స్టోర్స్, పురుగు మందుల దుకాణం మొదలగు వ్యాపారాలను ఎంచుకునే లబ్ధిదారుల అభివృద్ధిని కాంక్షిస్తూ మార్కెట్ లాభ నష్టాలపై వారికి అవగాహన కల్పించామన్నారు. స్వయం ఉపాధి యూనిట్ల ద్వారా వెంటనే లబ్ధి పొందేలా చూడాలని గ్రౌండింగ్ కమిటీకి సూచించారు. లబ్ధిదారుల యూనిట్లకు సంబంధించిన వారి నుంచి అంగీకర పత్రాలు తీసుకున్నామన్నారు. యూనిట్లకు సంబంధించి ఇంకా ఎస్టిమేషన్ ఇవ్వాల్సిన వారు వెంటనే అందజేయాలన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, మొదటి విడుతగా వారు ఎంచుకున్న యూనిట్లకు 50 శాతం నిధులు అందజేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో, యూనిట్ల విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించామన్నారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎస్సీ లబ్ధిదారుల యూనిట్లకు సంబంధించిన ట్రాక్టర్, ఆటో ట్రాలీ, గూడ్స్ వాహణాలు, వివిధ కంపెనీలకు సంబంధించిన మోడళ్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, ఆర్టీవో ఆఫ్రిన్ సిద్ధీఖీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : వరంగల్ జిల్లా క్రీడాకారులు వివిధ పోటీల్లో పతకాలు సాధించడం గర్వకారణమని కలెక్టర్ బీ గోపి అన్నారు. ఇటీవల మెదక్ జిల్లా నారాయణఖేడ్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులను గురువారం కలెక్టరేట్లో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెజ్లింగ్లో పీ పావని, హీనా రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో ఇందిర తదితరులు పాల్గొన్నారు.