వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 17: భారతదేశానికి సంస్కృతి, సంప్రదాయాలు రెండు కళ్లు అని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీనర్సింహరావు అన్నారు. శనివారం కాకతీయ మెడికల్ కళాశాల ఎన్ఆర్ఐ భవన్లో ఏర్పాటు చేసిన యూత్ ఫెస్ట్- 2022 ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులతో కలిసి కేఎంసీ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వరకు స్వచ్ఛభారత్ ర్యాలీని నిర్వహించారు. సాయంత్రం ఎన్ఆర్ఐ భవన్లో ఏర్పాటు చేసిన ముగింపు వేడుకల్లో రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మీనర్సింహరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదువుతున్న మీరందరూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా ప్రదర్శనలు ఇస్తూ 17విభాగాల్లో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇవ్వడం, రెండోసారి కాకతీయ మెడికల్ కళాశాల వేదికగా మారడం ఆనందంగా ఉందన్నారు. యువత తమ సృజనాత్మక శక్తికి పదును పెడుతూ వివిధ విభాగాల్లో నిర్వహించిన సాంస్కృతిక పోటీలను సైతం విజయవంతం చేయడం అభినందించాల్సిన విషయమన్నారు. ఈ ఉత్సాహాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి విద్యార్థి కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో పోటీపడి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్తో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం కో ఆర్డినేటర్ డాక్టర్ రాం కుమార్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.