నల్లబెల్లి, డిసెంబర్ 17: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామ పంచాయతీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం వల్ల నేడు అభవృద్ధి కుంటుపడుతున్నదని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ ప్రారంభం కాగానే రంగాపూర్, మామిండ్లవీరయ్యపల్లె, కొండంమల్పల్లె సర్పంచ్లు చీకటి ప్రకాశ్, అమరేందర్రెడ్డి, మోహన్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్రం అవలంబిస్తున్న కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని మోదీ సర్కార్ జీపీలకు నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేయడం వల్లే అభివృద్ధి కుంటుపడుతున్నదని దుయ్యబట్టారు. తక్షణమే కేంద్రం అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మండల సభలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అలాగే, కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై ఒక్కో సంచికి అదనంగా మూడు కిలోల వరకు తరుగు పేరుతో కటింగ్ చేస్తున్నారని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. అంతేకాకుడా మిషన్ భగీరథ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మండలంలోని నందిగామ, రేలకుంట, నల్లబెల్లితోపాటు పలు గ్రామాల్లో పైపులైన్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు చర్యలు చేపట్టి మండల ప్రజలకు రోజూ భగీరథ నీరు సరఫరా చేయాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు విడుదల చేసిందన్నారు. ఎంపికైన పాఠశాలల్లో త్వరితగతిన పనులు పూర్తి చేసేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మండల సభలో తహసీల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్కుమార్, వైస్ ఎంపీపీ గందె శ్రీలత, ఏవో పరమేశ్వర్, వైద్యాధికారి శశికుమార్ పాల్గొన్నారు.