ములుగు, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు భూముల సమస్యకు త్వరలో తెర పడనుంది. అర్హులైన పోడు సాగుదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు ఇటీవల సర్కారు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ములుగు జిల్లాలో 34,080 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు హాబిటేషన్ల వారీగా అధికారులు గ్రామాల్లో సర్వే చేసి దరఖాస్తుదారుల నుంచి ఆధారాలు సేకరించారు. గ్రామ సభల ద్వారా 2,210 దరఖాస్తులను మాత్రమే పట్టాల పంపిణీకి అర్హత ఉన్నట్లు గుర్తించిన అధికారులు జిల్లా స్థాయి కమిటీకి సిఫారసు చేశారు. ఆ కమిటీ నిర్ధారించిన తర్వాత అధికారికంగా పట్టాల పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అర్హులైన సాగుదారులకు పట్టాలు ఇచ్చేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక టీమ్లను నియమించి దరఖాస్తుదారుల భూములను సర్వే చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడంతో రాష్ట్రంలోనే అత్యధికంగా ములుగు జిల్లాలో 34,080 దరఖాస్తులు వచ్చాయి. అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు ఆర్వోవోఎఫ్ఆర్ భూ ముల సర్వే ప్రక్రియలో హాబిటేషన్ల వారీగా అధికారులు గ్రామాల్లో పర్యటించి సర్వే చేశారు. దరఖాస్తుదారుల నుంచి వివరాలు సేకరించారు. ప్రత్యేక గ్రామ సభల్లో పంచాయతీ సెక్రటరీ, అటవీ శాఖ బీట్ అధికా రి, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు ఎఫ్ఆర్సీ సభ్యు ల ద్వారా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలోని జీపీల్లో 2,210 మంది రైతుల దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల సమస్యకు త్వరలో తెర పడనుంది.
ఫలించిన అధికారుల కృషి
పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ప్రత్యేక దృష్టి సారించారు. హ్యాబిటేషన్ల వారీగా అధికారులను నియమించి నిరంతరం పర్యవేక్షించారు. దీంతో దరఖాస్తుల పరిశీలన, గ్రామ సభల నిర్వహణ అనంతరం దరఖాస్తులు సబ్ డివిజనల్ స్థాయి అధికారుల చేతుల్లోకి చేరేవరకు ఎలాంటి పైరవీలు లేకుండా శరవేగంగా ప్రక్రియ పూర్తయి ప్రాథమికంగా అర్హుల జాబితా సిద్ధమైంది. జిల్లా స్థాయి కమిటీ ఒక నిర్దారణకు వచ్చిన తర్వాత అధికారికంగా పట్టాలు పంపిణీ చేసే అవకాశాలున్నాయి. పలు దఫాలుగా దరఖాస్తుల పరిశీలనతో పాటు పూర్తయిన సబ్ డివిజనల్ కమిటీ దరఖాస్తుల పరిశీలనను అధికారులు చేపట్టారు. గ్రామ సభల్లో అనుమతించినవి, తిరస్కరించిన వాటిని సబ్ డివిజనల్ స్థాయి కమిటీ పరిశీలించి ఆన్లైన్లో ఇప్పటికే నమోదు చేసింది. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేసి అర్హుల జాబితాను జిల్లా కమిటీకి సిఫారసు చేశారు.