వరంగల్, డిసెంబర్ 13: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అవలంబిస్తున్న పారిశుధ్య విధానాలు బాగున్నాయని నేపాల్లోని మేయర్లు కితాబిచ్చారు. నేపాల్ దేశంలోని వివిధ నగరాల్లో ఇక్కడ అవలంబిస్తున్న పారిశుధ్య విధానాలను అమలు చేస్తామని వారు అన్నారు. నేపాల్ దేశంలోని పలు నగరాలకు చెందిన మేయర్ల బృందం అధ్యయన యాత్రలో భాగంగా గ్రేటర్ కార్పొరేషన్ను మంగళవారం సందర్శించింది. ఆస్కీ ప్రతినిధి రాజ్మోహన్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో అమలవుతున్న పారిశుధ్య పద్ధతులను మేయర్ల బృందానికి వివరించారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య విధానాలను పరిశీలించారు. అమ్మవారిపేటలోని మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. మావన వ్యర్థాల శుద్ధీకరణతోపాటు మావన వ్యర్థాలతో తయారైన ఎరువును పరిశీలించారు.
అక్కడి నుంచి అంబేద్కర్ నగర్లోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పరిశీలించారు. అక్కడి నుంచి వారు ప్రయోగాత్మకంగా ఆదర్శకాలనీలో ప్రారంభించిన సెప్టిక్ ట్యాంక్ల క్లీనింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో చూశారు. ఎంహెచ్నగర్ మురికివాడలో పర్యటించి వ్యక్తిగత మరుగుదొడ్ల విధానం, స్లమ్లో పాత వస్తువులతో నిర్మించిన చిట్టిపార్కును పరిశీంచారు. మురికివాడలో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడారు. అక్కడి ప్రజల జీవన స్థితిగతులతోపాటు కార్పొరేషన్ ద్వారా అందుదున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వడ్డేపల్లిలోని పబ్లిక్ టాయ్లెట్స్ను పరిశీలించి నిర్వహణను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేపాల్లోని మేయర్లు మాట్లాడుతూ గ్రేటర్ కార్పొరేషన్లో పారిశుధ్య విధానం బాగుందని అభిప్రాయపడ్డారు. నగర పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేసినట్లు కనిపిస్తున్నదన్నారు. వరంగల్ కార్పొరేషన్లో అవలంబిస్తున్న విధానలను తమ నగరాల్లో అమలు చేస్తామని వారు చెప్పారు. కార్యక్రమంలో నేపాల్ దేశంలోని పలు నగరాల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.
నేపాల్ మేయర్ల బృందం ఫిదా
పోచమ్మమైదాన్: వరంగల్ నగరంలో చేపడుతున్న శానిటేషన్తోపాటు ఇతర అభివృద్ధి పనులపై అధ్యయనం చేయడానికి వచ్చిన నేపాల్ మేయర్ల బృందం దేశాయిపేటలోని ఎంహెచ్నగర్ను సందర్శించింది. ఈ సందర్భంగా స్లమ్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి బృందం సభ్యులు ఫిదా అయ్యారు. సీసీరోడ్లు, డ్రైనేజీ, వ్యక్తిగత మరుగుదొడ్లు, వీధిలైట్లు, మిషన్ భగీరథ తాగునీరు, చిట్టిపార్కును చూసి కార్పొరేటర్ సురేష్కుమార్ జోషిని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం మురికివాడల్లో కూడా వసతులు కల్పించడం హర్షణీయమన్నారు. ఎంహెచ్నగర్ను కలియతిరిగి స్థానికులతో ముచ్చటించారు. చిట్టిపార్కులను చూసి సంబురపడ్డారు. కాలనీవాసులతో కలిసి ఫొటోలు దిగి వారితో సంతోషాన్ని పంచుకున్నారు.