నర్సంపేట, డిసెంబర్ 13: అర్హులైన రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో అశ్రద్ధ చేయొద్దని, మూడు రోజుల్లో డివిజన్ కమిటీ నివేదికను అందించాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూముల సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏయే గ్రామాల్లో సమస్యలు ఉన్నాయో గుర్తించి అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు తేల్చాల్సి ఉందన్నారు. జిల్లాలో ఉన్న లబ్ధిదారులు, వేరే జిల్లాలో ఉన్న భూమి వివరాలను కూడా తయారు చేయాలని కోరారు. ఈ వివరాలను బుధవారంలోగా అం దించాలని ఆదేశించారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి, గ్రామసభలు కూడా నిర్వహించారని, సభల్లో సాగుదారులు వ్యక్తం చేసిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కొంతకాలంగా అటవీ భూములను పోడు వ్యవసాయం చేసిన రైతులను గుర్తించి, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించాలన్నారు. అధికారులు శాఖల మధ్య సమన్వయంతో పని చేసి పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోనే పోడు సాగు ఎక్కువగా ఉందని గుర్తుచేశారు. అయితే, కొన్నిచోట్ల సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించడంలో అధికారులు ముందుండాలని సూచించారు. అధికారులు వేగవంతంగా పనులు పూర్తి చేసేలా డివిజన్స్థాయి అధికారులు చూడాలని కోరారు. ఎంపీడీవోలు త్వరితగతిన పనులు పూర్తి చేసి నివేదికను తయారు చేసి జిల్లాస్థాయి కమిటీకి అందించాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ వాకడే, డీఎఫ్వో అర్పణ, ఆర్డీవో శ్రీనివాసులు, డీటీడీవో ఎస్కే జహీరొద్దీన్ పాల్గొన్నారు.