ఖిలావరంగల్, డిసెంబర్ 10: క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెంపొందుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఖిలావరంగల్లోని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు దేహదారుఢ్యానికి దోహదం చేస్తాయన్నారు. అంతేకాకుండా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఓటమి గెలుపునకు నాంది పలుకుతుందని గుర్తుచేశారు. అనంతరం ఆయన క్రీడా పోటీల నిర్వహణ ఖర్చుల కోసం రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలి
పోచమ్మమైదాన్: ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే నరేందర్ కోరారు. 20వ డివిజన్ పద్మనగర్లో రంజిత్ ఫ్రెండ్స్ పరపతి సంఘం 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు నేత్ర పరీక్షలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమవంతుగా పేదలకు తోచిన సాయం అందించాలని కోరారు. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని ఏర్పాటు చేయాలని, దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన రంజిత్ ఫ్రెండ్స్ పరపతి సంఘం సభ్యులను అభినందించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, బీఆర్ఎస్, టీఎన్జీవోఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నన్నపునేనికి ఆహ్వానం
గిర్మాజీపేట: ఉర్సు సుభాష్నగర్లోని నాగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించనున్న అయ్యప్ప పడిపూజ, మహా అన్నదాన కార్యక్రమానికి అయ్యప్ప, శ్రీహరిహర పరపతి సంఘం సభ్యులు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ను ఆహ్వానించారు. శివనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.