వరంగల్, నవంబర్ 30 (నమస్తేతెలంగాణ):సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు యంత్ర పరికరాలను సబ్సిడీపై అందజేస్తున్నది. ప్రస్తుతం డ్రోన్లను ప్రయోగాత్మకంగా పంటలపై పురుగు మందుల పిచికారీ చేసేందుకు ఉపయోగిస్తుండగా, బహుళ ప్రయోజనాల దృష్ట్యా వీటి విస్తృత వినియోగంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో డ్రోన్ల వాడకంపై రైతులకు శిక్షణ ఇస్తున్నది. సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నది. కూలీల కొరత నుంచి ఉపశమనంతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందని వివరిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు వరి పంటపై డ్రోన్తో మందులు పిచికారీ చేస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు.
వ్యవసాయంలో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే అనేక రకాల యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. రైతులను ప్రోత్సహించేందుకు వీటిని సబ్సిడీపై అందజేస్తున్నది. వినియోగంలోనూ క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నది. ఈ క్రమంలో డ్రోన్లపై ఫోకస్ పెట్టింది. బహుళ ప్రయోజనాలిచ్చే వీటి వినియోగంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ ఇస్తున్నారు. శిబిరాలు నిర్వహించి మెలకువలు తెలియజేస్తున్నారు. ప్రదర్శనల ద్వారా అవగాహన పెంచుతున్నారు. వీటి వినియోగంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు కూలీల కొరతను కూడా అధిగమించవచ్చని చెబుతున్నారు. డ్రోన్లకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల సమాచారాన్నీ అన్నదాతలకు వివరిస్తున్నారు. వ్యవసాయంలో వీటి వినియోగం పెంచే దిశగా ముందుకు వెళ్తున్నారు.
ప్రస్తుతం పురుగు మందుల వినియోగానికే పరిమితమైన డ్రోన్ల వాడకాన్ని విత్తనాలు వెదజల్లడం, పోషకాలు, కలుపు మందుల పిచికారీ తదితర పనుల్లో ఉపయోగించడంపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వరి పంటపై డ్రోన్తో ప్రత్యక్షంగా పిచికారీ చేస్తూ రైతులకు అవగాహన కల్పించారు. డ్రోన్ల వినియోగంపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రధానంగా శాస్త్రవేత్తలు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగాలని రైతులకు చెబుతున్నారు.
ప్రస్తుతం వరి, వేరుశనగ, కుసుమ, నువ్వులు, పత్తి, కంది, సోయాచిక్కుడు తదితర పంటలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో డ్రోన్ అకాడమీ కూడా ప్రారంభమైంది. డ్రోన్ల వినియోగంతో యువతకు ఉపాధి కల్పించడం, వ్యవసాయానికి టెక్నాలజీని అందించడం లక్ష్యంగా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. చీడపీడల ఉధృతి, పంట రకాల వైవిధ్యం, పంటల సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా డ్రోన్లను వాడొచ్చని శిక్షణ కార్యక్రమాల్లో రైతులకు వివరిస్తున్నారు.
వినియోగంలో మెలకువలు..
వ్యవసాయ శాస్త్రవేత్తలు శిక్షణ కార్యక్రమాల్లో ముఖ్యంగా డ్రోన్ల వినియోగంలో రైతులకు మెలకువలను తెలియజేస్తున్నారు. ఎకరానికి వాడే మందు మోతాదు ఏ పిచికారీ సాధనంతో అయినా మారదని, న్యాప్శాక్, పవర్ స్ప్రేయరైనా, డ్రోన్ ద్వారైనా ఎకరానికి వాడాల్సిన మోతాదు ఒకటేనని స్పష్టం చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో డ్రోన్ల ద్వారా పిచికారీ చేయవద్దని, శిక్షితులైన డ్రోన్ పైలట్ ద్వారానే పిచికారీ చేయించాలని సూచిస్తున్నారు. గాలి వేగం సెకన్కు మీటరు కంటే తక్కువ, ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న సమయంలో డ్రోన్ వినియోగించవద్దని, డ్రోన్ ద్వారా పొడి మందులు పిచికారీ చేశాక డ్రోన్ ట్యాంకును బాగా శుభ్ర పరచాలని చెబుతున్నారు. హైటెన్షన్ వైర్ల కింద, సెల్ టవర్ దగ్గర, ఎత్తయిన చెట్లు, శిఖరాల వద్ద డ్రోన్ వినియోగించొద్దని, సిగ్నల్స్ అందక డ్రోన్ కూలిపోయి ప్రమాదాలకు దారి తీస్తుందని వివరిస్తున్నారు. కొన్ని రకాల సస్యరక్షణ మందులు ఉదాహరణకు కాపర్ ఆక్సీక్లోరైడ్, కాపర్ హైడ్రోక్లోరైడ్ వంటివి డ్రోన్ ద్వారా పిచికారీ చేయవద్దని సూచిస్తున్నారు. డ్రోన్ వినియోగించే వ్యవసాయ క్షేత్రంలో ముందుగా మ్యాపింగ్ చేయాలని, దీంతో పిచికారీ ఆ భూమి వరకే పరిమితం చేయవచ్చని పేర్కొంటున్నారు. పంట చివరి దశల్లో 16 లీటర్ల నీటిలో ఒక ఎకరానికి వాడాల్సిన మోతాదు మందును కలుపుకుని పిచికారీ చేయాలని వివరిస్తున్నారు.
పిచికారీకి అనుకూలమైన నాజిల్..
డ్రోన్ల వినియోగంలో ఎక్స్ఆర్ 11002 అనే నాజిల్ అన్ని రకాల రసాయనాలు, పురుగు, కలుపు మందులు, పోషకాలను పిచికారీ చేసేందుకు అనుకూలమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వ రంగ సంస్థలకు డ్రోన్లు ఉచితంగా అందుతున్నాయని, వీటిని యువతకు శిక్షణ ఇచ్చేందుకు, రైతులకు అవగాహన పెంచేందుకు వాడుతున్నట్లు చెప్పారు. డ్రోన్లపై రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్పీవో)లకు 75 శాతం, వ్యవసాయంలో పట్టభద్రులు, డిప్లొమా అభ్యర్థులకు 40 శాతం సబ్సిడీ ఉందనే సమాచారాన్ని రైతుల్లోకి తీసుకెళ్తున్నారు. రెండున్నర మీటర్ల ఎత్తులో డ్రోన్ వాడినపుడు పిచికారీ ఫలితాలు ఉంటాయని శిక్షణ కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచుతున్నారు.