ఏటూరునాగారం, అక్టోబర్ 18 : ఏటూరునాగారంలోని కొమురంభీం స్టేడియంలో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే క్రీడలకోసం ఉట్నూరు, భద్రాచలం, మైదాన ప్రాంతానికి చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల నుంచి 1,464మంది క్రీడాకారులు, 168మంది ఫిజికల్ డైరెక్టరు, పీఈటీలతో ప్రత్యక్షంగా మరో 350మంది అధికారులు, ఉపాధ్యాయులు, వర్కర్లు పాల్గొంటున్నా రు. ముఖ్యఅతిథిగా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ హాజరై కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం, ఉట్నూ రు, భద్రాచలం ఐటీడీఏ పీవోలు అంకిత్, వరుణ్రెడ్డి, గౌతం పొట్రు, ఏఎస్పీ అశోక్ కుమార్లతో కలిసి వేదికపై శాంతి కపోతాలను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఆరు జోన్ల నుంచి క్రీడాకారులు
ఈ క్రీడల్లో ఆరు జోన్ల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒక్కో జోన్ నుంచి ఒక్కో క్రీడలో అండర్-14, 17 సంవత్సరాల బాలబాలికలు రెండేసి జట్లుగా పాల్గొంటున్నాయి. జోన్-1 భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు, జోన్-2 ఏటూరునాగారం పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు, జోన్-3 ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి, జోన్-4 ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, జోన్-5 పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్కర్నూల్, జోన్-6 పరిధిలోని వికారాబాద్, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు చెందిన బాలబాలికలు పాల్గొంటున్నారు. ఈ క్రీడల్లో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, టెన్నికాయిట్, ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ పోటీల్లో క్రీడాకారులు పోటీ పడుతున్నారు. క్రీడా మైదానంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు.
పట్టుదల ఉంటే విజయం మీదే..
పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో సక్సెస్ అవుతారని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ అన్నారు. పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు కెరీర్లో పునాదుల్లా ఉపయోగపడుతాయని శారీరక, మానసికంగా దృఢంగా ఉండి క్రమశిక్షణ పాటిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. మీకున్న నైపుణ్యతను ప్రదర్శిస్తే జీవితంలో నిలదొక్కుకుంటారని పేర్కొన్నారు. క్రీడల ద్వారా ఎదురయ్యే అనుభవాలు జీవితంలో మంచి పాఠాలను నేర్పుతాయన్నారు. క్రీడాకారులకు ముఖ్యంగా క్రమశిక్షణ అవసరమని.. అది అలవర్చుకున్నపుడు పట్టుదల కూడా పెరుగుతుందని అవే గెలుపునకు దోహదపడుతాయని వివరించారు. క్రీడాకారులు తమ శారీరక దృఢత్వం కోసం మానసికోల్లాసం కోసం ప్రతి రోజూ ఆడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనే వారంతా కూడా మీమీ ఐటీడీఏ పరిధిలో విజయం సాధించినందునే ఇక్కడకు వచ్చారని, మీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి భద్రాచలంలో నిర్వహించే సొసైటీ మీట్కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఆత్మైస్థెర్యంతో క్రీడల్లో పాల్గొని గెలుపు కోసం కృషిచేయాలని కోరారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీవితంలో రాణించేందుకు క్రీడలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.
తొలిరోజు మనోళ్ల హవా..
గిరిజన క్రీడల్లో తొలిరోజు మనోళ్లు సత్తాచాటారు. పలు పోటీల్లో ఐటీడీఏ ఏటూరునాగారం జోన్(ఉమ్మడి వరంగల్) క్రీడాకారులు విజయం సాధించారు. ఐటీడీఏ తరపున ముందస్తుగా కొద్ది రోజులుగా ఎంపికైన క్రీడాకారులకు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లిలో ప్రత్యేక కోచింగ్ తీసుకున్నారు. దీని ఫలితంగా తొలిరోజు నిర్వహించిన క్రీడల్లో క్రీడాకారులు తమ ప్రతిభ కనబర్చారు. కబడ్డీ 17సంవత్సరాల బాలికల విభాగంలో ఏటూరునాగారం-ఉట్నూరు-2 జోన్ మధ్య జరిగిన పోటీల్లో ఏటూరునాగారం జోన్ క్రీడాకారులు తమ సత్తా చాటి విజేతగా నిలిచారు. ఖో-ఖో 14సంవత్సరాల బాలికల విభాగంలో మైదాన ప్రాంతం-2 టీంతో ఏటూరునాగారం జట్టు పోటీ పడింది. ఇందులో ఏటూరునాగారం టీం విజయాన్ని చేజిక్కుంచుకుంది. బాలుర విభాగంలో భద్రాచలంతో ఏటూరునాగారం జట్టు పోటీ పడగా ఏటూరునాగారం టీం 10పాయింట్లతో ముందువరుసలో నిలిచింది. ఇక అథ్లెటిక్స్లోనూ ప్రతిభ చూపారు. 400మీటర్ల పరుగు పందెం14 సంవత్సరాల బాలుర విభాగంలో ఏటూరునాగారం జోన్కు చెందిన ఎం.సతీశ్ తృతీయ స్థానంలో, 600 మీటర్ల పరుగుపందెంలో ఏటూరునాగారం జోన్కు చెందిన ఎం.చరణ్ మూడవ స్థానంలో, 800 మీటర్ల పరుగు పందెంలో ఏటూరునాగారం జోన్కు చెందిన బి.నవీన్ మూడవ స్థానంలో నిలిచి విజయం సాధించారు. 400 మీటర్ల బాలికల విభాగం పరుగుపందెంలో ఏటూరునాగారానికి చెందిన బి.వైష్ణవి ద్వితీయ స్థానంలో, 800 మీటర్ల విభాగంలో మూడవ స్థానంలో ఏటూరునాగారం జోన్కు చెందిన వి. దివ్యశ్రీ గెలుపొందారు.
మనసు పెట్టి ఆడాలి : కలెక్టర్ కృష్ణ ఆదిత్య
కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనేందుకు వారికి అవసరమైన డ్రెస్లు, షూలు అందించామన్నారు. కమిషనర్ ప్రత్యేక చొరవతో క్రీడల నిర్వహణకు అనుమతి ఇచ్చారని చెప్పారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనని.. మనసు పెట్టి ఆడాలని కోరారు. గతం కంటే క్రీడాకారుల్లో చాలా మార్పు వచ్చిందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడలు బాగా ఆడే వారు చదువులోనూ రాణిస్తారన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్ మాట్లాడుతూ క్రీడలతో చదువులో కూడా రాణించాలని, ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగి సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ పీవోలు అంకిత్, వరుణ్రెడ్డి, గౌతం పొట్రు, ఏఎస్పీ అశోక్కుమార్, డీడీలు పోచం, మంకిడి ఎర్రయ్య, జహీరుద్దిన్, ప్రేమకళ, ఎంపీపీ అంతటి విజయ, జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, పీహెచ్వో రమణ, ఎస్వో రాజ్కుమార్, ఈఈ హేమలత, ఏటీడీవో దేశీరాంనాయక్, ఏసీఎంవోలు రవీందర్, కె.రవీందర్, హీరులాల్, లింగాల శ్రీరాములు, రమాదేవి, చెంచయ్య, పొదెం కృష్ణ ప్రసాద్, స్కౌట్ మాస్టర్ గోపాల్, క్రీడల నిర్వహణ అధికారులు శ్యామలత, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.