తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిన ప్రసిద్ధ కవుల గొప్పదనం భావితరాలకు తెలిసేలా రాష్ట్ర సర్కారు విశేష కృషిచేస్తున్నది. తెలుగు సాహిత్యంలో అక్షర సేద్యం చేసిన బమ్మెర పోతన, తెలుగులో తొలి కవిగా ప్రఖ్యాతిగాంచిన పాల్కురికి సోమనాథుని జీవిత విశేషాలు తెలిసేలా జనగామ జిల్లాలో వారు నివసించిన బమ్మెర, పాలకుర్తి సహా పలు ప్రాంతాలను రూ.60కోట్లతో పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నది. 2017లో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకోగా పాలకుర్తిలో సోమనాథుడు, బమ్మెరలో పోతనామాత్యుని భారీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే వారి రచనలను ఇప్పటితరాలకు అందించేందుకు వీలుగా రెండు చోట్లా స్మృతివనాలతో పాటు మ్యూజియం, థియేటర్, లైబ్రరీ, కల్యాణమండపం, గార్డెనింగ్, తదితర నిర్మాణాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
వరంగల్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను చాటుకున్న గొప్ప కవులను స్మరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సాహిత్యంలో తెలంగాణకు గుర్తింపు తెచ్చిన ప్రాచీన కవుల జీవిత విషయాలను ప్రస్తుత తరానికి తెలియజెప్పేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. తెలుగు సాహిత్యంలో అక్షరసేద్యం చేసిన బమ్మెర పోతన, తెలుగులోనే తొలి కవిగా ప్రసిద్ధి చెందిన పాల్కురికి సోమనాథుని గొప్పదనాన్ని తెలిపేలా వారు నివసించిన ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నది.
సోమనాథుడు నివసించిన పాల్కుర్కి(ప్రస్తుత పాలకుర్తి), పోతన స్వస్థలం బమ్మెరలో సరికొత్త నిర్మాణాలు చేపట్టింది. పోతన, సోమనాథుని ఊర్లతో పాటు జనగామ జిల్లాలోని పలు ప్రాంతాలను దాదాపు రూ.60 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నది. బమ్మెరలో పోతన మ్యూజియం, థియేటర్, స్మృతివనం, అక్షరాభ్యాసం, పోతన సమాధి, పోతన పొలం వద్ద బావితో పాటు ఆ ప్రాంతంలో కొత్తగా రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లను మంజూరు చేసింది. పాలకుర్తిలో సోమనాథుని మందిరం, స్మారక విగ్రహం, స్మృతి మందిరం, లైబ్రరీ, కల్యాణమండపం, గార్డెనింగ్తో పాటు ప్రధాన రోడ్లకు అనుసంధానంగా కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు. రూ.16 కోట్లతో పాలకుర్తిలో ఈ పనులు జరుగుతున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా భారీ విగ్రహాలు
పాలకుర్తిలో సోమనాథుడు, బమ్మెరలో పోతన భారీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సోమనాథుని భారీ విగ్రహం ప్రత్యేకంగా ఉన్నది. పోతన, సోమనాథుల రచనలను ఇప్పటితరాలకు అందించేందుకు వీలుగా లైబ్రరీ, స్మృతి మందిరాల నిర్మాణం జరుగుతున్నది. పోతన సమాధి, పోతన వ్యవసాయం చేసిన బావిని పురావస్తు శాఖ కొత్తగా తీర్చిదిద్దుతున్నది. రూ.70 లక్షలతో ఈ పనులు చేస్తున్నారు. సోమనాథుని 11 అడుగుల విగ్రహాన్ని ఇటీవలే ఏర్పాటు చేశారు. విగ్రహం సమీపంలోని ఇతర పనులు చివరి దశకు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 ఏప్రిల్ 28న స్వయంగా బమ్మెరలో పోతన స్మృతి వనం నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ పనులన్నీ చివరి దశకు వచ్చాయి. బమ్మెర, పాలకుర్తితోపాటు సమీపంలోని వల్మిడిలోని సీతారామస్వామి ఆలయం గుట్టపై పర్యాటకుల వసతుల కోసం రూ.7 కోట్లతో పనులు చేపట్టారు. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లోని సర్వాయి పాపన్నగుట్టను రూ.4.50 కోట్లతో, జఫర్గఢ్లోని గుట్టను రూ.6 కోట్లతో, పెంబర్తిని రూ.5 కోట్లతో పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాచీన కవుల ఊర్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు బమ్మెర గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా పనులు చేపట్టారు.