హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): పర్యాటక వాహనాలకు ఒకే రాష్ట్రం ఒకే పన్ను వర్తింపజేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పన్ను విధానం నుంచి పర్యాటక వాహనాలను మినహాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట కార్మికులు పెద్దఎత్తున ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ.. సాధారణంగా ఐటీ, కార్పొరేట్, ఫార్మాస్యూటికల్ కంపెనీలతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్న ఆపరేటర్లు ఏడాది పొడవునా ఆదాయం పొందుతారని తెలిపారు. కానీ పర్యాటక ఆపరేటర్లు పూర్తిగా సీజనల్ బుకింగ్లు, తీర్థయాత్రలు, విహారాలు, విద్యా పర్యటనలపైనే ఆధారపడుతారని పేర్కొన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో తమకు గిరాకీ రావడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.