టేకులపల్లి, ఆగస్టు 26 : గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు సమితి జాతీయ అధ్యక్షుడు అమరనేని నర్స గౌడ్ నియామకాన్ని ప్రకటించారు. అనంతరం నియామక పత్రాన్ని వరప్రసాద్ గౌడ్కు అందజేశారు. గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం, గీత కార్మికుల సంక్షేమం కోసం సమితి చేస్తున్న పోరాటాలను జిల్లాలో మరింత విస్తరించాలని జాతీయ అధ్యక్షుడు సూచించారు. గౌడ కులస్తులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత అవకాశాల కల్పన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన జాతీయ, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గౌడ సోదరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు. గౌడ సామాజిక వర్గ హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.