పోచమ్మమైదాన్, అక్టోబర్ 5 : వరంగల్ శ్రీనివాసకాలనీలోని శ్రీశృంగేరి శంకరమఠంలో శ్రీశారదామాత శరన్నవరాత్రోత్సవాలు ముగిశాయి. మంగళవారం రాత్రి పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల ఆటపాటలు, కోలాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. భక్తులు, శంకర సేవా సమితి సభ్యుల సహకారంతో శారదా శరన్నవరాత్రోత్సవాలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని ప్రధాన అర్చకుడు సంగమేశ్వరజోషి తెలిపారు.
నర్సంపేటరూరల్ : మండలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవా రం దుర్గామాత భక్తులకు రాజరాజేశ్వరీదేవి అలం కారంలో దర్శనమిచ్చారు. భక్తులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. మండలంలోని ఇటుకాలపల్లి, ద్వారకపేట, మాదన్నపేట, లక్నేపల్లి, ముత్తోజీపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పోచమ్మమైదాన్ : విజయదశమి సందర్బంగా వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ వాసవీమాత ఆలయంలో అమ్మవారికి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీమాతకు 108 కళశాల పుష్పాలతో అభిషేకం చేశారు. అలాగే సాయంత్రం జమ్మిచెట్టుకు శమీపూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ డాక్టర్ గుండా ప్రకాశ్రావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు తాటికొండ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్, కోశాధికారి అనుముల కృష్ణమూర్తి పాల్గొన్నారు.
పర్వతగిరి : మండలంలోని తురుకల సోమారం జమాల్పురం షిరిడీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహం వద్ద అర్చకుడు వేమునూరి రమణాచారి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. దేవాలయ ధర్మకర్త చందా శ్రీనివాస్, చందా నరేశ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. బాబా విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఏనుగల్లులో, అన్నారం షరీఫ్, పర్వతగిరిలో రావణాసుర వధ కార్యక్రమం నిర్వహించారు.