తాగునీటి సరఫరాలోని లోపాలను సవరించి ప్రతి ఇంటికీ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో పైపులైన్ లీకేజీలు, నల్లా కనెక్షన్ల సర్వే పురోగతిపై బల్దియా ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షించారు.
ఓవర్ హెడ్ ట్యాంక్ల్లో తాగునీటిని నింపడం, సరఫరాలో సమయపాలన పాటించాలన్నారు. గ్రేటర్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా పక్కా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఏఈలు తాగునీటి సరఫరాపై నివేదిక అందించాలన్నారు. నగరంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలన్నారు. తాగునీటి సరఫరాపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తక్కువ ప్రెషర్తో వస్తున్న ప్రాంతాలను గుర్తించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇంటింటా నల్లా సర్వే మొదటి విడుతలో 1.15 లక్షల కనెక్షన్లకు 84 వేల కనెక్షన్లపై సర్వే చేసి రూ. 3.63 కోట్ల పన్ను మదింపు చేశామని అధికారులు వివరించారు. సమీక్షలో బల్దియా ఎస్ఈలు సత్యనారాయణ, ప్రవీణ్ చంద్ర, బల్దియా, పబ్లిక్ హెల్త్ ఈఈలు రాజ్కుమార్, రాజయ్య, డీఈ, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.