వరంగల్, మే 25: క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం అనువైన స్థలాలను ఎంపిక చేస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం వారు నగరంలోని పలు డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనాల కోసం స్థలాలను పరిశీలించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ప్రతి డివిజన్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హనుమకొండలోని కుమార్పల్లి, వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాలలోని క్రీడా స్థలాలను పరిశీలించామన్నారు.
ఆయా స్థలాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత వడ్డేపల్లి బండ్ వద్ద నిర్వహిస్తున్న నర్సరీలు, గ్రీన్ లెగసీలను పరిశీలించారు. మరింత సమర్థవంతంగా పనులు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో మొదటి విడుతలో 24 క్రీడా ప్రాంగణాలు, 23 నర్సరీలు, 36 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటుకు స్థలాలను గుర్తించామన్నారు. వారి వెంట అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, ఎస్ఈ సత్యనారాయణ, సీపీ వెంకన్న, ఈఈ లక్ష్మారెడ్డి, హెచ్వో ప్రిసిల్లా, స్మార్ట్సిటీ పీఎంవో ఆనంద్ వోలేటి ఉన్నారు.
నగరంలో ముంపు నివారణ కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. బొందివాగు నాలాను ఆమె కమిషనర్ ప్రావీణ్యతో కలిసి పరిశీలించారు. వచ్చే వర్షాకాలంలో నగరం ముంపునకు గురికాకుండా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 12 నుంచి 15 క్యూసెక్ల అధిక వరద ప్రవహింంచే బొందివాగు నాలాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
బొందివాగు నీటి పూడికతీత పనులను వెంటనే చేపట్టాలన్నారు. నగరంలోని 34 నాలాల్లో పూడికతీత పనుల కోసం రూ. 95 లక్షలతో టెండర్లు పిలిచిన విషయాన్ని మేయర్ గుర్తుచేశారు. నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీల్లో వర్షాకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వరదనీరు సాఫీగా వెళ్లేలా వరంగల్ అండర్ రైల్వేగేట్, పెరుకవాడ, సరోటాకీస్ మీదుగా హంటర్రోడ్లోని 12 మోరీల వరకు తాత్కాలికంగా వెంటనే కచ్చా కాల్వ తవ్వాలని సూచించారు. రైల్వేశాఖ చేపట్టిన 3వ లైన్ నిర్మాణంతో నాలాకు అడ్డుగా కట్ట వేయడంతో ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని గుర్తించిన మేయర్.. రైల్వే అధికారులను సంప్రదించి ఈ నెల చివరి వరకు పనులు పూర్తి చేసి అడ్డుకట్ట తొలగించాలని కోరారు.
తాగునీటి సరఫరాలోని లోపాలను అధిగమించి ప్రతి ఇంటికీ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో పైపులైన్ లీకేజీలు, నల్లా కనెక్షన్ల సర్వే పురోగతిపై బల్దియా ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షించారు. ఓవర్ హెడ్ ట్యాంక్ల్లో తాగునీటిని నింపడం, సరఫరాలో సమయపాలన పాటించాలన్నారు.
గ్రేటర్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా పక్కా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఏఈలు తాగునీటి సరఫరాపై నివేదిక అందించాలన్నారు. నగరంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలన్నారు. తాగునీటి సరఫరాపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తక్కువ ప్రెషర్తో వస్తున్న ప్రాంతాలను గుర్తించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇంటింటా నల్లా సర్వే మొదటి విడుతలో 1.15 లక్షల కనెక్షన్లకు 84 వేల కనెక్షన్లపై సర్వే చేసి రూ. 3.63 కోట్ల పన్ను మదింపు చేశామని అధికారులు వివరించారు. సమీక్షలో బల్దియా ఎస్ఈలు సత్యనారాయణ, ప్రవీణ్ చంద్ర, బల్దియా, పబ్లిక్ హెల్త్ ఈఈలు రాజ్కుమార్, రాజయ్య, డీఈ, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.