హనుమకొండ చౌరస్తా, మే 24 : కుమార్పల్లి ప్రాం తంలో ఆటోడ్రైవర్ మీర్జా అహ్మద్బేగ్ను హత్య చేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు హనుమకొండ ఏసీపీ కిరణ్కుమార్ తెలిపారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను మంగళవారం హనుమకొండ పోలీస్స్టేషన్లో ఏసీపీ వెల్లడించారు. సికింద్రాబాద్ చిలుకలగూడకు చెందిన ప్రధాన నిందితుడు పూజారి రాజేశ్ అలియాస్ లడ్డు ప్రస్తుతం హనుమకొండ కుమార్పల్లిలో ఉంటున్నాడు. రాజేశ్ అక్క పూజారి రోజాను మీర్జా అహ్మద్బేగ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కొన్నిరోజులు వారి కాపురం సజావుగానే సాగగా ఇద్దరి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. రోజా పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలిపారు.
ఈ క్రమంలో మృతుడు తన భార్యను తిరిగి ఇంటికి పంపించాలని రాజేశ్ను కోరాడు. ప్రవర్తన సరిగా లేనందున తన అక్కను పంపించలేదు. దీంతో కక్ష పెంచుకున్న మీర్జాఅహ్మద్బేగ్ తన భార్యతో పాటు నిందితుడు రాజేశ్, తల్లి మిగిలిన బంధువుల ఫొటోలను అవమానపర్చేవిధంగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నిందితుడు రాజేశ్.. అహ్మద్బేగ్పై హనుమకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, వేధింపులకు గురిచేస్తున్న అహ్మద్బేగ్పై రాజేశ్ కక్ష పెంచుకుని హత్యకు పథకం వేశాడు.
ఇందులో భాగంగా రాజేశ్, కుమార్పల్లికి చెందిన అనిశెట్టి బాలకృష్ణ, అబ్బరబోయిన మహేశ్, కంచరకుంటకు చెందిన గుటం జీవన్ ఈనెల 21న రాత్రి 8.30 గంటల సమయంలో కుమార్పల్లి కట్టెలదొడ్డి ప్రాంతంలో అహ్మద్బేగ్తో కలిసి మద్యం సేవించారు. పథకం ప్రకారం నిందితులు అహ్మద్బేగ్ కంట్లో కారంచల్లి మద్యం సీసాలను పగులగొట్టి గొంతు, శరీరంపై పొడిచారు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు బండరాళ్లతో కొట్టి చంపినట్లు తెలిపారు.
హత్య అనంతరం వారు యాదవనగర్ కాల్వ ప్రాంతంలోని తుమ్మచెట్లలో దాక్కొని రక్తం మరకలు ఉన్న బట్టలను మార్చుకున్నారు. సోమవారం రెడ్డిపురం క్రాస్ వద్ద సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు ద్విచక్రవాహనాలపై వస్తుండగా చిక్కినట్లు తెలిపారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన హనుమకొండ ఇన్స్పెక్టర్ వేణుమాధవ్, ఎస్సైలు ప్రసాద్, ఉమ, రాజ్కుమార్, కానిస్టేబుళ్లు బౌసింగ్, శివకృష్ణ, గౌస్పాషా, వీరేందర్, వినోద్, భాస్కర్, కిరణ్కుమార్, హోంగార్డు రవిని ఈ సందర్భంగా సీపీ అభినందించారు.