దేవరుప్పుల, మే 24 : పాలకుర్తి నియోజకవర్గానికి మరో 1500 దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయని, వీటితో దళితులు అభివృద్ధి చెందుతారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. స్థానిక సర్పంచ్ ఈదునూరి రమాదేవి గాయపడగా ఆమెను మంత్రి ఎర్రబెల్లి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గానికి మంజూరైన దళితబంధు యూనిట్లలో మండలానికి 300 వరకు అందజేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మొదటి విడుతలో దేవరుప్పుల మండలంలోని బంజర గ్రామ దళితులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలన్నారు.
వంట నూనెల వాడకం పెరిగిందని, దేశం ఎక్కువ శాతం నూనెల దిగుమతి పైఆధారపడి ఉందని, దీనిని అధిగమించేందుకు నూనె గింజల సాగు చేపట్టాలన్నారు. దీనికి మొదటి ప్రాధాన్యతగా ఆయిల్ పామ్ సాగు ఉందన్నారు. ప్రభుత్వం ఈ సాగును ప్రోత్సహిస్తూ సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఒక్కసారి సాగు చేస్తే 30 ఏళ్ల పాటు ఉంటుందని, నీటి వసతి ఉన్న ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపాలన్నారు. ఇక వరి తగ్గించి పత్తి, మిర్చి లాంటి వాణిజ్య పంటలు లాభదాయకమైనవన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, అందుబాటులో ఉంటూ అందరి అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ఎర్రబెల్లి తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎక్కువ కాలం ఉండేలా చూస్తానని వివరించారు. అన్ని గ్రామాల్లో పర్యటించి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా సభ్యుడు కారుపోతుల భిక్షపతి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి, మార్కెట్ కమిటీ సభ్యుడు జోగు సోమనర్సయ్య, దేవరుప్పుల ఉప సర్పంచ్ తోటకూరి దశరథ, తిరుమలేష్, బొందుగుల సోమయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లొడంగి వెంకటేశ్వర్లు, సందీప్, జేరిపోతుల సాయిలు, పొట్టిగుట్ట తండా సర్పంచ్ మూఢ శంకర్, వీరన్న తదితరులు ఉన్నారు.