తొర్రూరు, మే 24 : ‘మీ జ్ఞానానికి పదును పెట్టండి.. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ మీకు అండగా నిలుస్తుంది. రాష్ట్రంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నిరుద్యోగులు ఈ శిబిరంలో ఉన్నారన్న రికార్డును సృష్టించాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిరుద్యోగుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొర్రూరులో నిర్వహిస్తున్న నిరుద్యోగులకు ఉచిత ఉద్యోగ శిక్షణ శిబిరంలో మంగళవారం ఆయన పాల్గొని శిక్షణార్థులకు ట్రస్ట్ పక్షాన ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. శిక్షణ పొందుతున్న వారికి ప్రతి రోజూ అందిస్తున్న ఉచిత భోజనం నాణ్యతను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఇచ్చినా ప్రభుత్వ కొలువు సాధించిన తృప్తి మరో దానిలో ఉండదన్నారు. రాష్ట్రంలో కొలువుల జాతర నడుస్తున్నదన్నారు. ప్రతి మండలంలో వంద నుంచి రెండు వందలు, ప్రతి జిల్లాలో వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం కలిసివస్తున్నదన్నారు. శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించని వారికి ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేలా మెగా జాబ్మేళాను ఏర్పాటు చేస్తామని అందులో కూడా అవకాశాలు రాని వారికి ఉపాధి మార్గాలు దొరికే వరకు వెన్నంటి ఉంటానని మంత్రి బరోసా ఇచ్చారు. మంచి చేయాలనే సంకల్పం ఉన్నందున కొన్నేళ్లుగా ఉషాదయాకర్రావు ఆధ్వర్యంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.
ట్రస్ట్ స్థాపించిన తొలినాళ్లలోనే వర్ధన్నపేట నియోజకవర్గంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి దాతల సహకారంతో రూ.10 కోట్ల విలువైన శస్త్ర చికిత్సలు చేయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమలో ఆర్టీవో రమేశ్, ఎంపీపీలు తూర్పాటి చిన్న అంజయ్య, జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ వీ రామచంద్రయ్యశర్మ, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, రాష్ట్ర పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్ లింగాల వెంకటనారాయణగౌడ్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్రెడ్డి, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పీ సోమేశ్వర్రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్ నాగవాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, ఈదురు ఐలయ్య, వైస్ చైర్మన్లు ఇట్టే శ్యాంసుందర్రెడ్డి, జినుగ సురేందర్రెడ్డి, శ్రీరాం సుధీర్, నలమాస ప్రమోద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రామిని శ్రీనివాస్, కుర్ర శ్రీనివాస్, జయశంకర్ కోచింగ్ సెంటర్ అధినేత సత్యనారాయణచారి, పంజా కల్పన, పీ శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వారికి తొర్రూరు ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ వీ రాఘవరెడ్డితో కలిసి రూ. 2 లక్షల విలువైన 250 మందికి టీఎస్పీఎస్సీ రూపొందించిన జనరల్ స్టడీస్కు సంబంధించి రెండు వాల్యూమ్-1,2 పుస్తకాలను అందజేశారు. ఈ పుస్తకాలను మంత్రి దయాకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.