వరంగల్ చౌరస్తా, మే 18 : ప్రయాణికులను గమ్యం చేరుస్తూ రోడ్డుపై బతుకీడుస్తున్న ఆటో కార్మికుల పొట్ట కొడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గురువారం రాష్ట్ర వ్యాప్త ఆటోల బంద్ పాటిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఆటో డ్రైవర్స్ సంఘాల జేఏసీ ప్రతినిధులు తెలిపారు. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఇసంపల్లి సంజీవ, సిరిసిల్ల రమేశ్, బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర తీసుకువచ్చిన మోటర్ యాక్టు-2019కి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారని అన్నారు.
అయినా, ఈ చట్టాన్ని లోకసభలో ఆమోదింపజేసుకున్న బీజేపీ ప్రభుత్వం రోడ్డు భద్రత పేరుతో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడానికి నిర్ధిష్ట గడువు ముగియగానే జరిమానా పేరుతో కార్మికుల నోటికాడి కూడు లాక్కుంటుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్న రవాణా విభాగ కార్మికులపై ఏప్రిల్ 1 నుంచి ఈ చలాన్ల రూపంలో రూ.1035 జరిమానా వేస్తున్నారన్నారు.
ఫిట్నెస్ గడువు తీరిన రోజు నుంచి వాహనంపై రోజుకు రూ.50 ఫైన్ విధిస్తున్నారన్నారు. అనంతరం కార్మిక చట్టాల వల్ల ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరిస్త్తూ ప్రచురించిన కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓరుగల్లు ఆటో డ్రైవర్స్ అసోసియేషన్, న్యూ కాకతీయ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్, మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : కేంద్రం తీసుకు వచ్చిన మోటరు వాహన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం లారీలు, ఆటోలు, క్యాబ్ల యజమానులు రోడ్లపై నిరసనలు చేపట్టనున్నారు. రెండేళ్లుగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పెండింగ్లో ఉన్నాయని, ఈ సమయంలో జరిమానా వేయడం సరి కాదని లారీ ఓనర్స్ సంఘాలు నాయకులు మండిపడుతున్నారు.
ఇంజిన్ ఆయిల్ ధర గతంలో రూ.800 ఉండగా ఇప్పుడు రూ.1,800లకు పెరిగిందని వివిధ వాహనాల ఓనర్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రస్మా రాష్ట్ర సలహాదారు కొమ్మినేని భూపాల్రావు, బస్సుల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షుడు స్వరూప్రెడ్డి, ది వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల భూపాల్, ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ ఫిరోజ్ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తూ వరంగల్ ఆర్టీవో ఆఫిన్ సిద్ధిఖీకి వినతి పత్రాలు అందజేశారు. రోజుకు రూ.50 చొప్పున జరిమానాతోపాటు గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలంటే వాహనాలను అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు.