ములుగు, మే18 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ములుగు గ్రామపంచాయతీలో జరు గుతున్న అక్రమాలపై జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ఈవోలు కలిసి చేస్తున్న నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని ఇటీవల హైదాబాద్లోని విజిలెన్స్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నాలుగేళ్లలో 200 ఎకరాల వ్యవసాయ భూముల్లో అక్రమ లే ఔట్లకు అనుమతులు ఇచ్చి నిబంధనలు ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు.
సర్పంచ్, ఉప సర్పంచ్ భర్తలతో పాటు అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మద్దతు దారులకు పంపిణీ చేసినట్లు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను పక్కనపెట్టి డ్రైనేజీలు, అక్రమ లేఔట్లలో విద్యుత్ సౌకర్యంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. అక్రమ లేఔట్ ముసుగులో ఇళ్ల నిర్మాణాల అనుమతుల మంజూరు విషయంలోనూ భారీగా ముడుపులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముడుపులు చెల్లిస్తే అనుమతులు లేకుండా నిర్మాణానికి సహకరిస్తున్నారన్నారు.
జీపీ పరిధిలో 160 వీధి కుక్కలను చంపి అధికారుల సహకారంతో 1680 కుక్కలను చంపినట్లు బిల్లు పెట్టి ప్రభుత్వ సొమ్ము స్వాహా చేశారని ఆరోపించారు. సీసీరోడ్లు, డ్రై డ్రైనేజీల నిర్మాణాల్లోనూ నాణ్యత పాటించడం లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించే వారిని ప్రొత్సహిస్తూ చట్ట విరుద్దమైన క్రమబద్దీకరణకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
పల్లెప్రగతి పనుల్లోనూ ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. డీఎల్పీవో మద్దతుతో జీపీ నిధులను సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్నారు. అధికారులు స్పందించి విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులతో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వేడుకొన్నారు.