కాళేశ్వరం/ మహదేవపూర్/ వాజేడు/ మంగపేట/ ఏటూరునాగారం/కన్నాయిగూడెం, ఆగస్టు 9 : ఎగువ రాష్ర్టాల్లో కురిసిన వర్షంతో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పడిన వానలకు గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి, ప్రాణహిత నదులు పొంగి పొర్లుతున్నాయి.
పుష్కరఘాట్ వద్ద మంగళవారం 7.21 లక్షల క్యూసెక్కుల నీరుగా వస్తూ 11.55 మీటర్ల ఎత్తులో పారుతూ లక్ష్మీ బరాజ్ వైపు పరుగు లు తీస్తోంది. కాళేశ్వరం ప్రాజక్ట్లోని లక్ష్మీ బరాజ్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం ఇన్ఫ్లో 4,95, 370 క్యూసెక్కులు రాగా మంగళవారం ఇన్ఫ్లో 7,02,410 క్యూసెక్కులకు పెరిగింది. అంతేమొత్తంలో బరాజ్లోని గేట్లన్నీ (85) ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నట్లు భారీ నీటి పారుదల శాఖ డీఈ సురేశ్ తెలిపారు.
వాజేడు మండలం పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లతొక్కుతున్నది. వాజేడు నాగారం గ్రామశివారుకు వరదనీరు చేరి వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరు వద్ద సాయంత్రం నాలుగు గంటలకు 14.550 మీటర్లు(45)అడుగుల మేర గోదావరి నీటిమట్టం చేరుకుందని, మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సీడబ్యూసీ అధికారులు తెలిపారు.
అలాగే బొగత జలపాతానికి భారీగా వరద వస్తుండడంతో 50 అడుగుల పైనుంచి నీరు జాలువారుతున్నది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 14.870 మీటర్లకు చేరుకుంది. అయితే 14.830 మీటర్లకు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. సాయంత్రం ఐదు గంటలకు 15.350 మీటర్లకు చేరుకుంది.