ఖిలావరంగల్, ఆగస్టు 6 : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే వజ్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ గోపి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 8 నుంచి 22 వరకు వజ్రోత్సవాలు కొనసాగుతాయన్నారు. ఈ నెల 8న హైదరాబాద్ హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ వజ్రోత్సవాలను ప్రారంభిస్తారన్నారు.
10న జిల్లాలో మొక్కలు నాటడం, 11న ఫ్రీడం రన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 12న జాతీయ సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమం ఉంటుందని, 13న ఎన్సీసీ, ఎంఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఉద్యోగులు జెండా ర్యాలీతో పాటు మండల, గ్రామ స్థాయిలో మువ్వన్నెల బెలూన్లను ఎగురవేస్తామన్నారు. 14న జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కళా ప్రదర్శనలు, 15న స్వాతంత్య్ర వేడుకలు, 16న గ్రామాలు, మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో పాటు కవి సమ్మేళనం ఉంటుందన్నారు. 17న 75 మంది బ్లడ్ డోనర్స్తో జిల్లా హెడ్ క్వార్టర్స్లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుందని, 18న జిల్లా, మండల స్థాయిలో క్రీడల నిర్వహణ, 19న ప్రభుత్వ దవాఖానల్లోని రోగులకు పండ్ల పంపిణీ, 20న డీఆర్డీఏ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే, ‘గాంధీ’ సినిమాను విద్యార్థులు ఉచితంగా వీక్షించేందుకు థియేటర్ల యాజమాన్యాలు సర్వం సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో విద్యార్థులు సుమారు 54 వేల మంది ఉన్నారని, వీరందరూ గాంధీ సినిమా వీక్షించేందుకు అధికారులు, థియేటర్ల యాజమాన్యాలు ప్లాన్ చేయాలన్నారు. ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి కాక మాధవరావు, డీఈవో వాసంతిసమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, ఆర్డీవో మహేందర్జీ, అధికారులు పాల్గొన్నారు.