చిన్నగూడూరు, జూలై 30 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతోనే తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. సీరోలును నూతన మండలంగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మోదుగుగడ్డ గ్రామస్తులు శనివారం ఉగ్గంపల్లిలో రెడ్యాను కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి సీరోలును మండల కేంద్రంగా ప్రకటించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం పని చేస్తున్నట్లు తెలిపారు. మారుమూల పల్లెలు, తండాలు అనే తేడా లేకుండా పక్కారోడ్లు నిర్మించి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలిపినట్లు తెలిపారు.
కేసీఆర్ సహకారంతో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. సబ్బండ వర్గాల ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బీ రమేశ్, గ్రామస్తులు వీరు, శ్రీను, వీరన్న పాల్గొన్నారు.