ఏటూరునాగారం, జూలై 1 : సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు, సంచార వైద్య బృందాల పనితీరును అడిగి తెలుసుకున్నా రు. వైద్యులు అందుబాటులో ఉంంటూ గిరిజనులకు సేవలందించాలన్నారు. సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో క్రాంతి కుమార్కు సూచించారు. సమావేశంలో సీహెచ్సీ సూపరిండెంటెంట్ సురేశ్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో క్రాంతి కుమార్, వైద్యులు జ్యోత్స్న, శ్రీజ, చంద్రశేఖర్, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం మేనేజర్ మహేందర్ పాల్గొన్నారు.
జీసీసీ ప్రగతి సాధించే దిశగా ఉద్యోగులు పనిచేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ కోరారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం జీసీసీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జీసీసీ ద్వారా నిర్వహించే వ్యాపారాలను డివిజనల్ మేనేజర్ ప్రతాప్రెడ్డి వివరించారు. ఐదు సొసైటీల ద్వారా నిర్వహించిన వ్యాపార వివరాలను వెల్లడించారు. పెట్రోల్ బంక్ల వివరాలు అందజేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది అటెండెన్స్ కోసం వాట్సప్ ద్వారా ఫొటోను అప్లోడ్ చేయాలన్నారు. డీఆర్ డిపో భవనాల మరమ్మతుకు ఇంజినీరింగ్ అధికారులు ఎస్టిమేట్ తీసుకోవాలని సూచించారు. వినియోగదారులకు గ్యాస్ను అందుబాటులో నిల్వ ఉంచాలన్నారు. జీసీసీ ద్వారా సేకరించిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మహదేవ్ పూర్, ములుగు బ్రాంచ్ మేనేజర్లు బానోత్ హరిలాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాడ్వాయి : ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. మండలంలోని మేడారంలో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బోధనా తీరు, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.