గోదావరిఖని, జూలై 1 : బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందానికి సంబంధించి హైదరాబాద్లో శుక్రవారం జరిగిన సమావేశం ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసింది. రెండు గంటల పాటు సుధీర్ఘంగా చర్చలు సాగినా యాజమాన్యం ‘మీరు పేర్కొన్న విధంగా మేము వేతనాలు చెల్లించాలేము’ అంటూ సమావేశాన్ని వాయిదా వేసింది. గతంలో కేవలం 3 శాతం మాత్రమే వేతనాలు చెల్లిస్తామని పేర్కొన్న కోల్ఇండియా యాజమాన్యం.. ఈసారి చర్చల్లో మాత్రం వేతనాల పెంపుపై మాట్లాడలేదు. జాతీయ కార్మిక సంఘాల ప్రతిపాదనలు ఏం ఉన్నాయనే విషయాన్ని అడిగారు.
దీంతో తాము 50శాతం వేతనాలు పెంచాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. నాలుగు జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ వేతనాల పెంపుదలపై కొంతమేర తగ్గి చర్చల సందర్భంగా 47శాతం వరకు పెంపుదల ఉండాలని కోరారు. కోల్ఇండియా యాజమాన్యం మాత్రం తాము ఎట్టి పరిస్థితిలో అంత మొత్తం పెంచేది లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గని కార్మికులకు వేతనాల పెంపుపై ఎలాంటి సానుకూలత లేకుండా ఉందనేది చర్చల సందర్భంగా స్పష్టమైంది.
ఈ చర్చలను ముందుగానే వాయిదా వేయాలని భావించిన కోలిండియా యాజమాన్యం.. తాము ఎలాంటి ప్రతిపాదనలు చేయకుండా కార్మిక సంఘాల డిమాండ్ ఏమిటనేది తెలుసుకునేలా వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. కార్మిక సంఘాలు ఎంత మేర వేతనాలు పెరగాలనేది కోరుతున్నారని? ఎంతవరకు తగ్గుతారని అడిగారు. దీంతో కార్మిక సంఘాలు 50 నుంచి 47శాతం వరకు చెల్లించినా ఓకే అని చెప్పారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొంటూ కోలిండియా యాజమాన్యం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్లో జరిగిన వేజ్బోర్డు సమావేశం ఎలాంటి ముందడుగు లేకుండానే వాయిదా పడింది. ఈ క్రమంలో జాతీయ కార్మిక సంఘాలైన హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ త్వరలోనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసి ఒక వినతిపత్రం, డిమాండ్ల కాపీని అందజేస్తాం. బొగ్గు గని కార్మికుల వేజ్బోర్డు సమస్య పరిష్కరించాలి. కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించాలని పేర్కొంటాం. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే 11వ వేతన ఒప్పందంలో కార్మికులకు మెరుగైన వేతనాలు సాధించేందుకు అందోళన బాటపడతాం. అవసరమైతే సమ్మె చేయడానికి వెనుకాడేది లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ప్రైవేటీకరణను వేగవంతం చేయడం, విదేశీ బొగ్గును తీసుకురావడం వంటివి చేసేందుకు ఇలాంటి చర్యలు. బొగ్గు గని కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం.
-రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు, వేజ్బోర్డు సభ్యుడు