మారుమూల పల్లెల్లో నిత్యావసర సరకుల సరఫరాకే పరిమితమయ్యే జీసీసీ(గిరిజన సహకార సంస్థ) కాలానుగుణంగా మార్కెట్లో సరికొత్త పంథాతో ముందుకెళ్తోంది. వ్యాపారంలో నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ సహకారంతో గిరిజన గూడేల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రయోగాత్మకంగా వీటిని నెలకొల్పుతూ స్థానిక గిరిజన యువతకు ఉపాధి చూపుతోంది. ఈమేరకు ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కలిపి 14 బంకులు ఏర్పాటుచేసేందుకు ఆయిల్ సంస్థలు ముందుకురాగా, ఇప్పటివరకు తొమ్మిది ప్రారంభించారు. వినియోగదారులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంతో బంక్ల్లో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుండగా ఇప్పటికే రూ.63కోట్ల బిజినెస్ కావడం విశేషం.
– ఏటూరునాగారం, జూలై 1
జీసీసీ డివిజన్ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు ముందుగా అవసరమైన స్థలాన్ని ఎంపిక చేశారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి భూమి అప్పగించారు. వివిధ శాఖల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇక జీసీసీతో కలిసి వ్యాపారం చేసేందుకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీఎల్ కంపెనీలు ముందుకొచ్చాయి. వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మార్కెటింగ్ ఉందనుకున్న చోట బంకులు పెట్టేందుకు అంగీకరించారు. ఇందుకు జీసీసీ అధికారులు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు నిరంతరం కృషి చేశారు. ఏడాది కాలంలో 21 బంకులు ఏర్పాటు చేసేందుకు జీసీసీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కాగా, 14 బంకులు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే తొమ్మిది చోట్ల నెలకొల్పగా వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒక్కో బంక్లో నిత్యం ఆయా ఏరియా మార్కెటింగ్ను బట్టి రూ.5లక్షల వరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి.
ములుగు జిల్లాలో పది, మహబూబాబాద్ జిల్లాలో నాలుగు ఏర్పాటు చేస్తున్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం, మంగపేట మండలం రాజుపేట, ములుగు మండలం బండారుపల్లి, తాడ్వాయి మండలం కామారం, అన్నారం, కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి, కొత్తగూడ, గంగారంలో ఏర్పాటుచేసిన బంకులు నడుస్తున్నాయి. కాగా ములుగు మండలం ఇంచర్ల, మహబూబాబాద్ మండలం ఏదుల పూసపల్లిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక మంగపేట మండలం గంపోనిగూడెంలో పనులు ప్రారంభమయ్యాయి. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘనపూర్, ములుగు మండలం జాకారంలో ఏర్పాటుచేసే బంకులకు జాతీయ రహదారి అథారిటీ అనుమతి రావాల్సి ఉంది.
గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా బంకులు ఏర్పాటు చేసేందుకు మొదటినుంచీ జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తి నా త్వరితగతిన పరిష్కారమయ్యాయి. మూడు కంపెనీలతో జీసీసీతో ఒప్పందం కుదిరింది. నిర్వహణ బాధ్యత జీసీసీదే. కమిషన్పై వ్యాపారం కొనసాగుతుంది. ఇప్పటికీ తొమ్మిది ప్రారంభించాం. మూడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో మూడు ప్రాసెస్లో ఉన్నాయి. మారుమూల గ్రామాల్లోని వాహనదారులు, రైతులు, ఉద్యోగులకు నాణ్యమైన ఆయిల్ను అందించే అవకాశం లభించింది. ఇంకా సీసీ కెమెరాలు, జనరేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
– ప్రతాప్రెడ్డి, జీసీసీ డివిజనల్ మేనేజర్
స్థానికంగానే ఉపాధి దొరికింది. దూరం వెళ్లే పని తప్పింది. టెన్త్ పూర్తయి నేను ఇంటి వద్దే ఉంటున్నా. ఈ సమయంలో గ్రామంలో పంచాయతీ ద్వారా పెట్రోల్ బంక్లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని చాటింపు చేశారు. వెంటనే అప్లయ్ చేశాను. అవకాశం వచ్చింది. స్థానికంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం వల్లే నాకు పని దొరికింది. దీని వల్ల నా కుటుంబానికి సాయంగా ఉంటాను.
– కొర్ర రాధిక
ప్రతి బంక్లో ఏడుగురికి ఉపాధి అవకాశం లభించింది. ఆయా గ్రామాల నిరుద్యోగ యువతీ, యువకులను గ్రామసభలో సర్పంచ్ అర్హులైన వారిని ఎంపిక చేశారు. పదో తరగతి ఉత్తీర్ణతను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు. వారికి ఆయా కంపెనీలు ఇతర బంకుల్లో కొద్ది రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. సేల్స్మెన్లతో పాటు స్వీపర్లు, వర్కర్లను కలిసి సుమారు 150మందికి ఉపాధి లభించింది. స్థానికంగా ఉపాధి లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది నుంచి దఫదఫాలుగా ఏర్పాటు చేసిన బంక్ల్లో ఆయా ఏరియా మార్కెటింగ్ను బట్టి రూ. లక్ష నుంచి రూ.5లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఏర్పాటుచేసిన బంకుల్లో రూ.63 కోట్ల వరకు వ్యాపారం అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా వ్యాపారం పుంజుకొనే అవకాశాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ వాహనంతో పాటు కార్యాలయంలోని ఇతర వాహనాలు కూడా ములుగు మండలం బండారుపల్లి బంక్లోనే డీజిల్, పెట్రోల్ పోయిస్తున్నారు. అన్ని పూర్తయి వినియోగంలోకి వస్తే ఏటా రూ.100 కోట్ల వ్యాపారం జరిగే అవకాశాలున్నాయి.
ఇక్కడ బంక్ ఏర్పాటు చేయడం వల్లే నాకు ఇక్కడ పని దొరికింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. నాలాగే చాలామంది పని చూపించారు. ప్రభుత్వం ద్వారా ఇలా స్థానికంగా బంకులు ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉంది. దీని వల్ల కుటుంబానికి అండగా ఉన్నట్లు అయింది.
– బానోత్ శ్రీనివాస్
మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో జీసీసీ ముందుకొచ్చింది. రెండు సంవత్సరాల ప్రణాళిక ఇప్పుడు అమలులోకి వచ్చింది. బంకులను రైతులు, వ్యాపారులు, వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ క్వాలిటీ ఆయిల్ను విక్రయిస్తాం. ఎలాంటి మోసాలు ఉండవు. జీసీసీని వ్యాపారపరంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంతో పాటు ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఉంది.
– దేవ్, జీసీసీ బ్రాంచి మేనేజర్